V6 News

వేధింపుల కేసులో లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా సీఐ, ఎస్సై

వేధింపుల కేసులో  లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా సీఐ, ఎస్సై
  • రూ.60 వేలు అడిగి, రూ.40 వేలకు ఒప్పందం  
  • రూ.20 వేలు ఇచ్చినా మరో 20 వేల కోసం సతాయింపు 
  • తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

వికారాబాద్​, వెలుగు: భార్యను వేధిస్తున్నాడని తాండూరుకు చెందిన ఓ కౌన్సిలర్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 60 వేలు లంచం అడిగిన వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్సై రాణిలపై మంగళవారం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు దొరకడంతో పోలీస్ స్టేషన్‌‌లోనే గంటల తరబడి విచారణ జరిపారు. 

వికారాబాద్​జిల్లా తాండూరుకు చెందిన ఓ కౌన్సిలర్ భార్య తనను భర్తతో పాటు అత్తమామలు, చెల్లెళ్లు, సోదరుడు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసులో సీఐ సరోజ, ఎస్సై రాణి.. నిందితులకు, ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్​ఇవ్వకుండా అదే రోజు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.     నిందితుడిని స్టేషన్​కు పిలిపించి హైదరాబాద్​లో ఉంటున్న చెల్లెళ్లకు, వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు అందరికీ నోటీసులు ఇస్తామని బెదిరించారు. 

అలా జరగకుండా ఉండాలంటే ఆరుగురికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 60 వేలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. దీంతో అంత ఇవ్వలేనని, రూ. 40 వేలు ఇస్తామని నిందితుడు ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్న ప్రకారం ముందు రూ.20 వేలను సీఐ సరోజ సమక్షంతో ఎస్సై రాణికి చెల్లించాడు. మిగిలిన రూ. 20 వేలు సర్దుబాటు కాలేదని, త్వరలోనే ఇస్తానని చెప్పాడు. 

అయినా వేధిస్తుండడంతో ఏసీబీ అధికారులను కలిసి విషయం వివరించాడు. వారు విచారణ జరపగా, అది నిజమేనని తేలింది. సాక్ష్యాధారాలు దొరకడంతో ఏసీబీ డీఎస్​పీ ఆనంద్​కుమార్​ఆధ్వర్యంలో ఏసీబీ టీం మంగళవారం పోలీస్​స్టేషన్​కు వచ్చి సీఐ, ఎస్సైలను విచారణ జరిపి కేసు నమోదు చేసింది.  కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్​పీ ఆనంద్​కుమార్​చెప్పారు.