రియల్ ఎస్టేట్లో నాగలక్ష్మితో కలిసి దేవికారాణి పెట్టుబడులు
వ్యాపారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్న ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: ఈఎస్ఐలో మందుల స్కామ్పై దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ దేవికా రాణి, ఇతర నిందితుల అక్రమ సంపాదన వివరాలను సేకరిస్తోంది. మంగళవారం రూ.4 కోట్ల 47 లక్షలను స్వాధీనం చేసుకుంది. అవినీతి సొమ్మును ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలిసి రియల్ఎస్టేట్లో దేవికారాణి పెట్టుబడి పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ఐటీ కారిడార్, సైబరాబాద్లో రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సులకు సొమ్మును మళ్లించినట్టు ఆధారాలు సేకరించింది. సైబరాబాద్లోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి దేవికారాణి రూ.3 కోట్ల 75 లక్షలు, నాగలక్ష్మి రూ.72 లక్షలు పెట్టుబడిగా ఇచ్చినట్టు గుర్తిం చింది. వాళ్లిద్దరి ఇండ్ల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఈ విషయాన్ని తేల్చింది. కుటుంబ సభ్యుల పేరిట 1,600 గజాల ఆరు రెసిడెన్షియల్ ప్లాట్స్ కోసం రూ.22 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చినట్టు, రూ.2 కోట్ల 29 లక్షల 30 వేలను చెక్కులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా చెల్లించినట్టు నిర్ధారించింది. వీటి ఆధారంగా సైబరాబాద్లోని ఆ డెవలపర్కు ఏసీబీ నోటీసులిచ్చింది. అవినీతి డబ్బును తిరిగి అప్పగించాలని, లేకపోతే ఆస్తులను అటాచ్ చేస్తామని హెచ్చరించింది. దీంతో అతడు రూ.4.47 కోట్లను ఏసీబీ అధికారులకు అందజేశాడు. ఆ డబ్బును ఏసీబీ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
For More News..