
భద్రాచలం, వెలుగు : పీసా యాక్ట్ ప్రకారం ఆదివాసీ గిరిజన మహిళలు సొంతంగా ఇసుక ర్యాంపులు నడుపుకొని జీవనోపాధి పొందాలని ఆ గ్రామంలోని గిరిజన మహిళా సొసైటీలకే బాధ్యతలు అప్పగించనున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్తెలిపారు. ఐటీడీఏ మీటింగ్ హాలులో గురువారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి ఇసుక ర్యాంపుల నిర్వహణ వారికి అప్పగించొద్దన్నారు.
మహిళలందరూ ఐక్యంగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అంతకుముందు ర్యాంపుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి మహిళలతో పీవో చర్చించారు. ప్రతీ అంశం రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. సాంకేతిక, ఆర్థిక సహకారాలతో పాటు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసా స్పెషల్ ఆఫీసర్ అశోక్కుమార్, టీజీఎండీసీ మేనేజర్ శంకర్నాయక్, ఏడీ మైన్స్ దినేశ్ కుమార్ పాల్గొన్నారు.