లింగాల, వెలుగు: సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. సోమవారం లింగాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పెండింగ్ కేసుల వివరాలను ఆరా తీశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అచ్చంపేట సీఐ నాగరాజు, ఎస్సై వెంకటేశ్ గౌడ్ ఉన్నారు.
