2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించి సాక్ష్యాధారాలను కల్పితం చేశారన్న ఆరోపణలపై ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్పై ఛార్జ్షీటు దాఖలు చేశామని, కాబట్టి కస్టడీ విచారణ అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు, వారికి దూరంగా ఉంచేందుకు సెతల్వాద్ ఎలాంటి ప్రయత్నం చేయరాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. ఇటీవలే ఆమె రెగ్యులర్ బెయిల్ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. ఆమెను వెంటనే లొంగిపోవాలని కోరింది. తాజాగా హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. సెతల్వాద్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, గుజరాత్ రాష్ట్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు. ఈ కేసులో జూలై 5న ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్కు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. గుజరాత్ హైకోర్టు తీర్పుపై సెతల్వాద్ దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు.. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.
ALSO READ :10ఏళ్ల బాలికను పని మనిషిగా పెట్టుకుని కొట్టారు.. జైలు పాలయ్యారు...
గుజరాత్ హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన తర్వాత జులై 1న వారం రోజుల పాటు ఆమెను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు గతంలో విచారణలో ఉంచింది. అంతకుముందు ముంబైకి చెందిన తీస్తాపై.. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో పాలుపంచుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర వ్యక్తులను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.