
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కేసులో ఈడీ నోటీసులకు నటుడు రానా దగ్గుబాటి స్పందించారు. జులై 23న విచారణకు హాజరు కాలేనని బదులిచ్చాడు . షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ ఉన్నందున ఆరోజు ఈడీ విచారణకు రాలేనని చెప్పాడు. విచారణకు మరింత సమయం కావాలని ఈడీని కోరారు రానా.
ఈడీ షెడ్యూల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారించేందుకు ఈడీ షెడ్యూల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మికి జులై 21న సమన్లు జారీ చేసింది. జులై 23న రానా దగ్గుబాటి, 30న ప్రకాశ్రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పాన్కార్డుసహా బ్యాంక్ లావాదేవీలు, లోన్ యాప్స్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరుకావాలని సూచించింది.
ALSO READ : War 2 Trailer: ఎన్టీఆర్ ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్.. మీ క్యాలెండర్లో ఈ డేట్ మార్క్ చేసుకోండి
పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు, సినీ హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలోనే విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది.