
- బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రశ్నించనున్న ఈడీ
- ఇప్పటికే 11 మంది సెలబ్రిటీల విచారణ పూర్తి
- కెల్విన్ మనీలాండరింగ్లో ఎవిడెన్స్ కోసం ఎంక్వైరీ
హైదరాబాద్, వెలుగు: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో సినీ నటుల విచారణ నేటితో ముగియనుంది. నటుడు తరుణ్ను బుధవారం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సిట్ కేసు స్టేట్మెంట్ వివరాల ఆధారంగా మనీట్రాన్సాక్షన్స్పై విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలను ఈడీ విచారించింది. వాళ్ల స్టేట్మెంట్ను కలెక్ట్ చేసింది. డ్రగ్స్ ఇంపోర్ట్స్, మనీలాండరింగ్పై దర్యాప్తు చేసింది. గత నెల 31 నుంచి ప్రారంభమైన ఈడీ ఎంక్వైరీ.. డ్రగ్స్ కేసు నిందితుడు కెల్విన్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా జరిగింది.
మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానం
కెల్విన్ నుంచి బిట్కాయిన్స్, హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. 2016 నుంచి 2017 జూన్ వరకు కెల్విన్ భారీగా ఫారిన్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా సెలబ్రిటీల మనీ ట్రాన్సాక్షన్స్ను పరిశీలించింది. దేశవ్యాప్తంగా కెల్విన్ గ్యాంగ్పై రిజిస్టరైన డ్రగ్స్ కేసుల డేటాను కలెక్ట్ చేసింది. ఎన్సీబీ, ఎక్సైజ్ సిట్ అందించిన రిపోర్ట్స్ ఆధారంగా ముంబై, గోవా డ్రగ్ పెడ్లర్స్తో కెల్విన్ మనీ ట్రాన్సాక్షన్స్ గుర్తించింది. సుమారు 38 అకౌంట్స్ నుంచి కెల్విన్ కు మనీ ట్రాన్స్ఫర్ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే 12 మందిసెలబ్రిటీలు సహా మరో 62 మందికి సమన్స్ ఇష్యూ చేసింది.
కెల్విన్ ట్రాన్సాక్షన్స్ డేటా తీసిన ఈడీ
డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్పై ప్రధానంగా ఫోకస్ పెట్టిన ఈడీ.. కెల్విన్ అకౌంట్స్తో లింకైన అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ను గుర్తించింది. కెల్విన్ చెప్పిన ఫారిన్ ట్రాన్సాక్షన్స్ను ఫ్రీజ్ చేసింది. సెలబ్రిటీలు, కెల్విన్, జిషాన్తో పాటు డ్రగ్స్ పెడ్లర్ల అకౌంట్స్ను ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. బిట్కాయిన్స్తో కెల్విన్ జరిపిన మనీట్రాన్సాక్షన్స్, డార్క్వెబ్లో డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేసినట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసులో సాక్ష్యాధారాలు సేకరించేందుకు సెలబ్రిటీలను ఈడీ విచారించినట్లు తెలిసింది. తరుణ్ విచారణ తర్వాత మరికొందరికి సమన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.