ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు గ్రూప్- 1లో సత్తా

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు  గ్రూప్- 1లో సత్తా

ఆదిలాబాద్​టౌన్/నిర్మల్/బెల్లంపల్లి/ఇంద్రవెల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా అభ్యర్థులు గ్రూప్​1లో సత్తా చాటారు. గురువారం వెలువడిన ఫలితాల్లో పలువురు ఉత్తమ ర్యాంకులు సాధించి ఉన్నతాధికారుల పోస్టులకు ఎంపికయ్యారు. 

బోథ్​మండల కేంద్రానికి చెందిన సీనియర్​జర్నలిస్ట్​కరిపె మల్లేశ్, రేవతి దంపతుల కొడుకు సాయికమల్​ రాష్ట్రస్థాయిలో 113వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాయికమల్​ఇప్పటికే ఏఈగా ఉద్యోగం సాధించి మిషన్​ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు. 

రైతు బిడ్డకు 157 ర్యాంక్

భైంసా పట్టణంలోని పిప్పిరి కాలనీకి చెందిన సూర్వే సిద్దేశ్వర్–రత్నమాల కొడుకు సాయికుమార్ గ్రూప్ 1లో 157 ర్యాంకు సాధించి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్​కు ఎంపికయ్యాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. సాయికుమార్ టెన్త్ వరకు భైంసాలోని వాసవి స్కూల్​లో, ఇంటర్, బీటెక్ హైదరాబాద్​లో పూర్తిచేశాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని సాయికుమార్​ తెలిపాడు. 

శశిధర్ ​రెడ్డికి నాలుగో ఉద్యోగం

ఆదిలాబాద్​పట్టణానికి చెందిన సరసన్ ​శశిధర్​రెడ్డి సత్తా చాటాడు. 2016లో ఎక్సైజ్​లో కానిస్టేబుల్​గా ఉద్యోగం సాధించిన శశిధర్.. 2017లో ఫైర్​ కానిస్టేబుల్, 2024లో గ్రూప్​4 సాధించాడు. గురువారం విడుదలైన గ్రూప్​1 ఫలితాల్లో అసిస్టెంట్​ట్రెజరర్​ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. 

బెల్లంపల్లికి చెందిన కొత్తూరు సత్యనారాయణమూర్తి 280వ ర్యాంక్ సాధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. ఇంద్రవెల్లి మండలంలోని వాగాయితాంద గ్రామానికి చెందిన రాథోడ్ ప్రమోద్ 458.5 మార్కులతో 420వ ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగం దక్కించుకున్నాడు.