
వెలుగు బిజినెస్ డెస్క్ : రెండేళ్ల తర్వాత మళ్లీ రూరల్ ఏరియాలలో షాంపూలు, బిస్కెట్లు,, సబ్బులు వంటి ప్రొడక్టులకు గిరాకీ పెరుగుతోంది. దేశంలోని మొత్తం ప్యాకేజ్డ్ ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సేల్స్లో 35 శాతం గ్రామాల నుంచే వస్తోంది. ఈ సీజన్లో పంటలు బాగా పండటంతోపాటు, లిక్విడిటీ మెరుగవడంతో రూరల్ ఏరియాలలో అమ్మకాలు పుంజుకున్నట్లు ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇన్ఫ్రాపై ప్రభుత్వం ఖర్చు పెంచడంతోపాటు, పెండిండ్ల సీజన్ కూడా డిమాండ్ ఎక్కువవడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. నవంబర్ 2022లో రూరల్ ఏరియాలో వాల్యూమ్స్ 6–7 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందు క్వార్టర్లలో ఈ వాల్యూమ్ 2,3 శాతానికి మించలేదని పార్లే ప్రొడక్ట్స్ కేటగిరీ హెడ్ మాయాంక్ షా చెప్పారు. 2022 ఫైనాన్షియల్ ఇయర్లో పార్లే ప్రొడక్ట్స్ కంపెనీ టర్నోవర్ 2 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. పంటలు బాగుండడంతోపాటు, ఇన్ఫ్లేషన్ తగ్గడమే డిమాండ్ పెరగడానికి కారణమని షా పేర్కొన్నారు. ఎఫ్ఎంసీజీ సెక్టార్ రివైవల్కు రూరల్ డిమాండ్ చాలా ముఖ్యం. గత మూడు వారాలుగా గిరాకీ పెరగడం చూస్తున్నామని, ముఖ్యంగా తక్కువ రేటుండే ప్యాక్స్ (లో యూనిట్ ప్యాక్స్) బాగా అమ్ముడవుతున్నాయని డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుష్ జైన్ వెల్లడించారు. వాటికా షాంపూ, ఫెమ్ బ్లీచ్వంటి ప్రొడక్టులను డాబర్ అమ్ముతోంది. పెండ్లిండ్ల సీజన్ కావడంతో పర్సనల్ కేర్ ప్రొడక్టుల కేటగిరీలోనూ సేల్స్ కొంత మెరుగయ్యాయని జైన్ వివరించారు. డాబర్ అమ్మకాలలో 47 శాతం రూరల్ ఏరియాల నుంచే వస్తున్నాయని చెప్పారు. గిరాకీ ఊపందుకోవడంతో లక్ష గ్రామాలకు డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ ఏరియాలలో అమ్మకాలు పెరగడం తాము కూడా గమనించినట్లు ఇమామి మేనేజింగ్ డైరెక్టర్ హర్ష అగర్వాల్ పేర్కొన్నారు. బోరోప్లస్ క్రీమ్ వంటి ప్రొడక్టులను ఈ కంపెనీ తయారు చేస్తోంది.ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచడంతో రూరల్ ఏరియాలలో డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని రేటింగ్స్ ఏజన్సీ క్రిసిల్ ఒక రిపోర్టులో వెల్లడించింది. మారికో, విప్రో కన్జూమర్, బ్రిటానియా కంపెనీల ప్రతినిధులు సైతం గిరాకీ పెరిగినట్లు చెబుతున్నారు. ఆరు క్వార్టర్ల తర్వాత డిమాండ్ పుంజుకుందని చెప్పారు.
రాబోయే రోజుల్లో మరింత జోరు....
రాబోయే రోజుల్లో డిమాండ్ జోరు మరింత ఎక్కువవుతుందని ఆశిస్తున్నట్లు అగర్వాల్ వెల్లడించారు. ఇమామి అమ్మకాలలో 45 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వచ్చాక, గత రెండేళ్లలో రూరల్ ఏరియాలలో ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. కరోనా కారణంగా సప్లయ్చెయిన్, డిస్ట్రిబ్యూషన్ సమస్యలను ఈ రంగంలోని కంపెనీలు ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత కమోడిటీల రేట్లు , ఫ్యూయల్ ధర , ప్యాకేజింగ్ ఖర్చులూ పెరగడంతో కంపెనీలు తమ ప్రొడక్టుల రేట్లను పెంచక తప్పలేదు. దీంతో తక్కువ రేట్లకు దొరికే ప్రొడక్టులను కొనడానికే రూరల్ ఏరియాలలోని కన్జూమర్లు పరమితమయ్యారు. ఫలితంగా గిరాకీ పడిపోయింది.