
టీమిండియా రేపు సౌతాఫ్రికాతో తలపడబోతున్న నేపథ్యంలో..సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీపై సౌతాఫ్రికా బ్యాట్స్మన్ ఆడెన్ మార్కరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీకి, దక్షిణాఫ్రికా బౌలర్ల మధ్యే పోరు అని తెలిపాడు. కోహ్లీకి బౌలింగ్ చేయడం కోసం తమ బౌలర్లు ఎదురుచూస్తున్నారని చెప్పాడు. సౌతాఫ్రికాకు అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉందని..ఈ విభాగాన్ని కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరమని చెప్పుకొచ్చాడు.
మా బౌలర్లపై నమ్మకముంది...
సౌతాఫ్రికా బౌలర్లు ప్రస్తుతం బాగా రాణిస్తున్నారని ఆడెన్ మార్కరమ్ అన్నాడు. టీమిండియాతో జరిగే మ్యాచ్లోనూ రాణిస్తారని నమ్మకముందని చెప్పాడు. పైగా పెర్త్ పిచ్..మిగతా పిచ్ల కంటే భిన్నమైందన్నాడు.ఈ వికెట్ బౌన్స్ వికెట్ అని తెలిపాడు. ఎక్స్ ట్రా బౌన్స్ను ఉపయోగించుకుంటూ..తమ బౌలర్లు టీమిండియాపై పైచేయి సాధిస్తారని పేర్కొన్నాడు.
బౌలింగే కాదు..బ్యాటింగ్లోనూ మెరుగే...
సౌతాఫ్రికా బౌలింగ్లోనే కాదు..బ్యాటింగ్లోనూ మెరుగ్గా ఉందని మార్కరమ్ తెలిపాడు. టాప్ ఆర్డర్ రాణిస్తే మాత్రం జట్టు భారీ స్కోరు సాధిస్తుందన్నాడు. టాప్ ఆర్డర్ విజృంభిస్తే..మిడిలార్డర్ ఆ దూకుడును కొనసాగిస్తుందన్నాడు. మొత్తానికి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు..ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకుని..ఆదుకోవాల్సిన అవసరం ఉందని మార్కరమ్ చెప్పుకొచ్చాడు.