హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. బీఆర్ఎస్కి నష్టం కలిగించకుండా తాము గెలిచే నియోజకవర్గాల్లోనే పోటీ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న అంబర్పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సనత్నగర్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ముధోల్ తదితర సెగ్మెంట్లలోనూ పోటీకి దూరంగా ఉంది. బీఆర్ఎస్ అనుకూల ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంలో మజ్లిస్ ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికితోడు తన రాజకీయ స్వార్థం కోసమే ఈ స్ట్రాటజీ ఎంచుకున్నదనే విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ సారి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగుతున్నది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి నవీన్ యాదవ్.. ఇండిపెండెంట్గా బరిలోకి దిగి 45వేల ఓట్లు సాధించాడు.
ఈసారి జూబ్లీహిల్స్ నుంచి తమ అభ్యర్థిని బరిలోకి దించుతున్నది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు చెక్ పెట్టాలని భావిస్తున్నది. ఈ సెగ్మెంట్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ కు టర్న్ అయితే అజారుద్దీన్ గెలిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు అయినా లబ్ధి చేకూర్చేలా చేయాలనేది మజ్లిస్ స్ట్రాటజీ. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది.
నాంపల్లి, చార్మినార్ సెగ్మెంట్ల ఫలితాలు రివర్స్ అయినా.. మజ్లిస్ సీట్ల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు రాజేంద్రనగర్ను ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేవారు. కానీ.. ఈసారి ఫోకస్ అంతా కాంగ్రెస్పైన పెట్టినట్లు స్పష్టం అవుతున్నది. మజ్లిస్ పోటీ చేసే స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. స్టేట్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో ఆ పార్టీపైనే అసదుద్దీన్ విమర్శలు గుప్పిస్తున్నారు.