
వెలుగు బిజినెస్ డెస్క్: రెండేళ్ల కష్టాల తర్వాత ఎయిర్లైన్స్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు లాభాల బాటలోకి నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో విమాన ప్రయాణాలు పెద్దగా సాగని విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 1,900 కోట్ల నికర లాభం ఆర్జించనుందని అంచనా. మూడో క్వార్టర్లో ఎయిర్లైన్స్ కంపెనీల పనితీరును బట్టి ఇది అర్థమవుతుంది.
అదరగొట్టిన ఇండిగో
మార్కెట్ వాటా ప్రకారం దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్గా పేరొందిన ఇండిగో కిందటి క్వార్టర్లో రికార్డు లెవెల్ ప్రాఫిట్ ప్రకటించింది. మరోవైపు మొదలైన తర్వాత మొదటిసారిగా బ్రేక్ఈవెన్ సాధించినట్లు విస్తారా వెల్లడించింది. అనూహ్యంగా స్పైస్జెట్ లిమిటెడ్ కూడా తన లాభాన్ని నాలుగు రెట్లు పెంచుకుంది. ఈ కంపెనీకి రూ. 106.80 కోట్ల నికర లాభం వచ్చింది. న్యూఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టులు రెండూ ప్రైవేటు రంగంలోనే నడుస్తున్నాయి. ఈ రెండు ఎయిర్పోర్టుల వల్లే ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ఎందుకంటే ఈ రెండిటినీ నడిపే కంపెనీలు రెవెన్యూలో కొంత పర్సంటేజీని ఏఏఐకి చెల్లించాలి. ఎయిర్ ట్రాఫిక్ మెరుగుపడిన కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏఏఐ నికరలాభం సంపాదించనుందని స్పోక్స్పర్సన్ చెప్పారు. ఈ లాభం సుమారు రూ. 1,900 కోట్ల దాకా ఉండొచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వ డేటా ప్రకారం జనవరి 2023 దాకా అంటే 10 నెలల్లో దేశంలోని ఎయిర్పోర్టులు 267 మిలియన్ల మంది పాసింజర్లను హ్యాండిల్ చేశాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. కొవిడ్కి ముందు అంటే 2019–20 లోని ఎయిర్ట్రాపిక్లో 91 శాతాన్ని ఈ ఏడాది అందుకోగలిగాయి. ఫిబ్రవరి నుంచి ఎయిర్ ట్రాఫిక్ జోరు మరింత పెరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో సగటున రోజుకి 4.2 లక్షల మంది విమాన ప్రయాణాలు చేశారు. డిసెంబర్ 2022 లో ఈ సంఖ్య 4.1 లక్షలు మాత్రమే. మార్చి 2022 తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో ఏఏఐకి రూ. 8.8 కోట్ల నికర లాభమే వచ్చింది. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో రెవెన్యూ రూ. 6,841 కోట్లు. 25 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా 2020–21 లో ఏఏఐ రూ. 1,962 కోట్ల నష్టం ప్రకటించింది. కరోనా కారణంగా ఎయిర్ ట్రావెల్ డిమాండ్ తగ్గిపోవడం వల్లే నష్టాలు వచ్చాయి. అదే కనక, 2019–20 కి చూస్తే ఏఏఐ రూ. 12,387 కోట్ల రెవెన్యూ మీద రూ. 1,985 కోట్ల నికర లాభం సంపాదించింది. 2021–22 కి డివిడెండ్ చెల్లించలేమని ప్రభుత్వాన్ని అనుమతి కోరిన ఏఏఐ ఈ ఫైనాన్షియల్ ఇయర్కు మాత్రం నికరలాభంలో 30 శాతం దాకా డివిడెండ్గా ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఏఐ కింద దేశంలోని 100 ఎయిర్పోర్టులున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి.
టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచే వెసులుబాటు వద్దు..
ఫ్రీ మార్కెట్ ఎకానమీ పేరుతో ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లను ఎయిర్లైన్స్ కంపెనీలు వసూలు చేయకుండా చూడాలని పార్లమెంటరీ పానెల్ ఒకటి అభిప్రాయపడింది. విమాన టికెట్లకు అప్పర్, లోవర్ క్యాప్స్ (పరిమితులు) పెట్టాల్సిందిగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని ఈ ప్యానెల్ కోరింది. ఒకవైపు ప్రైవేటు రంగంలోని ఎయిర్లైన్స్ కంపెనీల ప్రయోజనాలను కాపాడుతూనే, మరోవైపు ప్రయాణికుల బాగోగులు కూడా పట్టించుకోవల్సిన అవసరం ఉందని ప్యానెల్ పేర్కొంది. తమ ఇష్టా రాజ్యంగా రేట్లను పెంచుకునే వెసులుబాటు కంపెనీలకు ఇవ్వరాదని అభిప్రాయపడింది. పీక్ ట్రావెల్ సీజన్స్లో రేట్లు అకస్మాత్తుగా పెరగడం తెలిసిందే. ఈ సమ్మర్ వెకేషన్ టైమ్లోనూ విమాన టికెట్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 27 నెలల తర్వాత కిందటి ఆగస్టు నెలలో విమాన టికెట్ల రేట్లపై పరిమితులను ప్రభుత్వం తొలగించింది. రెండు నెలల లాక్డౌన్ తర్వాత మే 25, 2020 నాడు సర్వీసులు మొదలయినప్పుడు టికెట్ల రేట్లపై లోవర్, అప్పర్ లిమిట్స్ను ప్రభుత్వం పెట్టింది. ఎయిర్లైన్స్కంపెనీలు నష్టాల పాలవకుండా కాపాడటానికి లోవర్ లిమిట్స్ను కూడా నిర్ణయించారు. టికెట్ల రేట్లు పెంచుకునేలా ఇప్పుడున్న వెసులుబాటు ఎయిర్లైన్స్ కంపెనీలకు ఉండకూడదని, లోవర్, అప్పర్ లిమిట్స్ నిర్ణయించే మెకానిజం ఉండాలని పానెల్ పేర్కొంది.