బల్లియా: ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్పై దుమారం రేగుతోంది. పలువురు బీజేపీ నేతలతోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఆయన్ను విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ అఖిలేశ్ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. జిన్నాను సర్దార్ పటేల్తో పోల్చిన అఖిలేశ్ది తాలిబాన్ మెంటాలిటీ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. జిన్నాను పొగిడితే భారత్లోని ముస్లింలు పొంగిపోరని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇదే వరుసలో తాజాగా యూపీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా కూడా అఖిలేశ్పై ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం అఖిలేశ్ ఇస్లాంలోకి మారతాడని ఆనంద్ వ్యాఖ్యానించారు.
‘ఇస్లామిక్ ప్రపంచానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పెద్ద సవాలుగా మారారు. అందుకే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్ని వర్గాల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ నుంచి అఖిలేశ్కు ప్రోత్సాహం అందుతోంది. వారి దగ్గర నుంచి ఆయనకు ఆర్థిక సాయం అందే అవకాశం కూడా ఉంది. ముస్లింలను శాంతింపజేయడానికి ఆయన నమాజ్, రోజా చేశారు. ముస్లిం ఓట్ల కోసం ఆయన మతమార్పిడికి కూడా వెళ్లొచ్చు. ఐఎస్ఐ ఆదేశాల మేరకే జిన్నాను అఖిలేశ్ పొగుడుతున్నారు. పాకిస్థాన్, తాలిబాన్ ఏం కోరుకుంటే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఆనంద్ శుక్లా విమర్శించారు.