- రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ధ ఇన్వెస్ట్మెంట్
- మల్టిపుల్ డేటా సెంటర్లు ఏర్పాటు
- 3 జోన్లతో హైదరాబాద్లో క్లౌడ్ రీజియన్
- 2022లో అందుబాటు.. కేటీఆర్
- కేటీఆర్తో ఏడబ్ల్యూఎస్ అధికారులు వర్చ్యువల్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లో ఒకటైన ఏడబ్ల్యూఎస్.. మన రాష్ట్రంలో మల్టిపుల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఏడబ్ల్యూఎస్ రూ.20,761 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(ఎఫ్డీఐ) అని చెప్పారు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పలు మీటింగ్స్ అనంతరం, తెలంగాణలో మల్టిపుల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు, రూ.20,761 కోట్లు(2.77 బిలియన్ డాలర్లు) పెట్టుబడికి ఏడబ్ల్యూఎస్ ఓకే చేసిందని వెల్లడించారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ హైదరాబాద్ రీజియన్ 2022 మధ్యలో ఏర్పాటు చేస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్లో మూడు అవైలబులిటీ జోన్లతో(ఏజెడ్లు) ఏడబ్ల్యూఎస్ ఆసియా–పసిఫిక్ రీజియన్ను ఏర్పాటు చేస్తున్నట్టు వర్చ్యువల్ మీటింగ్లో ఏడబ్ల్యూఎస్ తెలిపింది. ఏడబ్ల్యూఎస్ ఆసియా–పసిఫిక్ రీజియన్ 2022 మిడిల్లో హైదరాబాద్లో ఆపరేషన్స్ ప్రారంభిస్తుందని పేర్కొంది. అవైలబులిటీ జోన్లలో మల్టిపుల్ డేటా సెంటర్లు ఉంటాయి. ఒకే రీజియన్ పరిధిలో పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒకదానికొకటి స్వతంత్రంగా ఇవి పనిచేస్తాయి. పవర్, కూలింగ్, ఫిజికల్ సెక్యూరిటీ, లో లేటెన్సీ నెట్వర్క్ ద్వారా కనెక్షన్లు ఇవ్వడం వంటివి ఉంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, కొరియా, సింగపూర్లలో ఏడబ్ల్యూఎస్కు 26 అవైలబులిటీ జోన్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 77 అవైలబులిటీ జోన్లు ఉండగా… మరో 15 జోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. వాటిలో ఇండియా, ఇండోనేషియా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్లలో ఐదు ఏడబ్ల్యూఎస్ రీజియన్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. వచ్చే కొన్నేళ్లలో ఈ సెగ్మెంట్లో చాలా గ్రోత్ ఉంటుందని, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి పలు రంగాల్లో డేటా లోకలైజేషన్ అవసరాలు పెరుగుతాయన్నారు. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఏడబ్ల్యూఎస్ కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో పోటీ పడుతోంది. ఏడబ్ల్యూస్ ఇండియాలో తన తొలి రీజియన్ను 2016లో ముంబైలో ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలలో ఎడ్జ్ లొకేషన్ల ద్వారా తన సర్వీసులను విస్తరిస్తోంది.
ఇతర కంపెనీలు కూడా ఇక్కడికే…
ఏడబ్ల్యూఎస్ నుంచి వచ్చిన ఈ భారీ ఇన్వెస్ట్మెంట్తో తెలంగాణ ఇతర కంపెనీలకు కూడా ముఖ్యమైన, అత్యంత ఇష్టమైన డెస్టినేషన్లలో ఒకటిగా మారుతోంది. భవిష్యత్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్తో పాటు ఇతర కంపెనీలు కూడా ఇక్కడే డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చూస్తారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏడబ్ల్యూఎస్ తెలంగాణ డిజిటల్ ఎకానమీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సాయం చేయనుందని కేటీఆర్ తన అధికారిక ప్రకటనలో తెలిపారు. ఏడబ్ల్యూఎస్ ఆసియా–పసిఫిక్(హైదరాబాద్) రీజియన్ మరింత మంది డెవలపర్లకు, స్టార్టప్లకు, ఎంటర్ప్రైజస్కు, ప్రభుత్వ, ఎడ్యుకేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లకు తమ అప్లికేషన్లు రన్ చేసుకునేందుకు సాయం చేయనుంది. అంతేకాక తన డేటా సెంటర్ల నుంచి ఎండ్ యూజర్లకు కూడా సేవలందించనుంది.
ఐటీ సెక్టార్ రికార్డ్ గ్రోత్…
గత కొన్నేళ్ల నుంచి ఐటీ సెక్టార్లో హైదరాబాద్ రికార్డ్ గ్రోత్ రేటు నమోదు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఇనొవేటివ్ స్టార్టప్లకు, ఎంటర్ప్రైజస్కు, స్కిల్డ్ వర్కర్స్కు హైదరాబాద్ హౌస్గా మారిం దన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న సపోర్ట్చూ సి ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఏడబ్ల్యూఎస్ రీజియన్కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయన్నారు. ‘2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చిన అతిపెద్ద ఏఫ్డీఐ ఏడబ్ల్యూఎస్ ఇన్వెస్ట్మెంటే కావడం విశేషం. ఇతర ఇన్వెస్ట్మెంట్లకు ఇది ప్రోత్సాహకరంగా నిలుస్తుంది. అమెజాన్తో ప్రస్తుతమున్న సంబంధాలను ఇది బలోపేతం చేస్తుంది. హైదరాబాద్లో అమెజాన్కు ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద ఆఫీసు క్యాంపస్ ఉంది’ అని కేటీఆర్ చెప్పారు.
ఏడబ్ల్యూఎస్ కస్టమర్లు…
ఇండియాలో ఏడబ్ల్యూఎస్ కస్టమర్లుగా అశోక్ లేలాండ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ క్యాపిటల్, క్లియర్ట్యాక్స్, డ్రీమ్11, ద్రువా, ఎడెల్విస్, ఎడునెక్ట్స్, ఎక్స్ట్రామార్క్స్, ఫ్రెష్వర్క్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా ఎలక్ట్రిక్, ఓలా, ఓయో, పాలసీబజార్, ఆర్బీఎల్ బ్యాంక్, రెడ్బస్, శ్రదా యూనివర్సిటీ, టాటా స్కై, స్విగ్గీ, యప్టీవీ, జెరోధా వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసులను వాడుతున్నాయి. ఏడబ్ల్యూఎస్ అకాడమీ, ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ ద్వారా లోకల్ డెవలపర్లకు, స్టూడెంట్లు, తర్వాతి జనరేషన్ ఐటీ లీడర్లకు స్కిలింగ్ను పెంచేందుకు ఏడబ్ల్యూఎస్ పెట్టుబడులు పెడుతోంది.