- నువ్వా నేనా!
- మొదటి సారిగా ఇరు కంపెనీల మధ్య డైరెక్ట్గా పోటీ..
- రెన్యువబుల్ ఎనర్జీ కోసం భారీగా పెట్టుబడులు
- 10 ఏళ్లలో రూ. 1.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్న అదానీ
- గ్రీన్ ఎనర్జీ కోసం 3 ఏళ్లలో రూ. 75 వేల కోట్లు పెట్టుబడిపెడతామన్న ముకేష్ అంబానీ
బిజినెస్డెస్క్, వెలుగు: గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో అదానీ, అంబానీకి మధ్య పోటీ మొదలయ్యింది. ఇప్పటి వరకు డైరెక్ట్గా పోటీ పడని ఈ గుజరాతీలు, ఈ ఏడాది పోటీకి దిగారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో వచ్చే మూడేళ్లలో రూ. 75 వేల కోట్లు (10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేష్ అంబానీ ఇప్పటికే ప్రకటించగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లలో 20 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామని తాజాగా పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ కోసం, ఈ సెక్టార్కి అవసరమయ్యే ఎక్విప్మెంట్ల తయారీ కోసం ఈ పెట్టుబడులను వాడతామని అదానీ చెప్పారు. హైడ్రోజన్ తయారీలో కూడా ఎంటర్ అవుతామన్నారు. గ్లోబల్గా రెన్యువబుల్ ఎనర్జీని తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీగా 2030 నాటికి ఎదగాలని అదానీ గ్రీన్ ఎనర్జీ టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ సెక్టార్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొన్న గౌతమ్ అదానీ అన్నారు. అంతేకాకుండా తమ ఫోకస్ ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ సెక్టార్పైనే ఉందనే సంకేతాలను ఇచ్చారు. 2025 వరకు కేటాయించిన క్యాపెక్స్లో 75 శాతం వాటాను గ్రీన్ టెక్నాలజీ సెగ్మెంట్లో పెడతామని గౌతమ్ అదానీ చెప్పారు. ‘వచ్చే 10 ఏళ్లలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రొడక్షన్, కాంపోనెంట్ల తయారీ, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటి సెగ్మెంట్లలో 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తాం’ అని ప్రకటించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో అదానీ గ్రూప్ ముందుంది. ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీ 25 గిగావాట్ల కరెంట్ను ప్రొడ్యూష్ చేస్తోంది.
అంబానీవి పెద్ద ప్లాన్లే..
గుజరాత్ జామ్నగర్లోనే రెన్యువబుల్ ఎనర్జీ కోసం అతిపెద్ద ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని ముకేష్ అంబానీ ఇప్పటికే ప్రకటించారు. సోలార్ ఎక్విప్మెంట్ల నుంచి ఎనర్జీ స్టోరేజ్, హైడ్రోజన్ ఎనర్జీ కోసం ఎలక్ట్రోలైట్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కేజీ హైడ్రోజన్ను ఒక డాలర్కే అమ్ముతామని ప్రకటించారు కూడా. 2030 నాటికి 100 గిగా వాట్ల సోలార్ ఎనర్జీని క్రియేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అంబానీ ప్లాన్స్ అదానీనిఇబ్బంది పెట్టేవే. గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో మరింతగా విస్తరించాలంటే అదానీ అంబానీకి ధీటుగా పెట్టుబడులు పెట్టాల్సిందే. వచ్చే నాలుగేళ్లలో రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీని మూడింతలు పెంచుతామని గౌతమ్ అదానీ ప్రకటించారు. ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో కెపాసిటీని విస్తరించడంలేదని అన్నారు.
అన్నింటా మేమే..
గౌతమ్ అదానీ తమ ఇతర బిజినెస్ల గురించి మాట్లాడారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్పై ఫోకస్ కొనసాగుతుందని, దీనికి రిలేటెడ్ సెక్టార్లలో విస్తరిస్తామని చెప్పారు. అదానీ ఎంటర్ప్రైజెస్లోనే కొత్త బిజినెస్లను క్రియేట్ చేస్తామని అన్నారు. 2025 నాటికి నెట్ జీరో ఎమిషన్ కంపెనీగా పెట్టుకున్న టార్గెట్ను ఇప్పటికే పోర్టు బిజినెస్ దాటిందని అన్నారు. దేశంలోని తమ డేటా సెంటర్లకు 2030 నాటికి రెన్యువబుల్ కరెంట్తో పవర్ సప్లయ్ చేస్తామని చెప్పారు. ఎయిర్పోర్ట్స్, డిజిటల్ బిజినెస్లను విస్తరించడానికి ప్లాన్స్ ఉన్నాయని, ముంబై ఎయిర్పోర్టును విస్తరించడంతో పాటు 2024 నాటికి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అదానీ డిజిటల్ బిజినెస్లలో డేటా సెంటర్లు, ఇండస్ట్రియల్ క్లౌడ్స్, డిజిటల్ ల్యాబ్స్ బిజినెస్లు ఉన్నాయి. అదానీ గ్రూప్ డేటా సెంటర్ల బిజినెస్ను వేగంగా విస్తరిస్తోంది.
మీడియా దేశం పరువు తీయకూడదు..
పత్రికా స్వేచ్చ ముసుగులో మీడియా ఒక వర్గానికి తలొగ్గకూడదని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. మీడియా చేసే విమర్శలు దేశ పరువును తీసేదిగా ఉండకూడదన్నారు. ఇండియా లాంటి దేశంలో కరోనా సంక్షోభాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమన్న ఆయన, ప్రభుత్వం చర్యలను సమర్ధించారు. ‘ఎప్పుడు విమర్శలు చేస్తామా అని వేచి చూడ్డం కంటే, యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలలో కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం సంక్షోభాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేసిందో గుర్తించాలి’ అని జేపీమోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ సమ్మిట్లో గౌతమ్ అదానీ పేర్కొన్నారు. తాజాగా అదానీ గ్రూప్ మీడియా బిజినెస్లోకి ఎంటర్ అవుతుందనే వార్తలొస్తున్నాయి. ఈ టైమ్లో ఆయన మీడియాను విమర్శించడం విశేషం. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ పుగాలియాను అదానీ గ్రూప్ నియమించుకుంది. సంజయ్ గతంలో బీబీసీ రేడియో, నవ్భారత్ టైమ్స్, జీ న్యూస్, స్టార్ న్యూస్, సీఎన్బీసీ, క్వింట్ వంటి సంస్థల్లో సీఈఓగా, చీఫ్ ఎడిటర్గా పనిచేశారు.