
వికారాబాద్, వెలుగు: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పట్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కాసిం, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించాలని ఆనాడే అంబేద్కర్ సూచించారని చెప్పారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దానిని పరిరక్షించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ శ్యామ్ రావు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్, కాంగ్రెస్ నాయకులు సురేశ్, రాములు, రామేశ్వర్, సురేశ్ పాల్గొన్నారు.