
కాంగ్రెస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు
సిటిజన్షిప్ సవరణ చట్టంపై చర్చకు రండి
రాహుల్, అఖిలేశ్లకు అమిత్ షా సవాల్
లక్నో: ‘సిటిజన్షిప్ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు అపోహలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా సరే సీఏఏను వెనక్కి తీసుకునే సమస్యే లేదు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. సీఏఏకు మద్ధతుగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ సహా తృణమూల్, ఎస్పీ, బీఎస్పీలపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ల నుంచి వలస వచ్చిన మైనారిటీలకు సిటిజన్ షిప్ ఇవ్వాలన్న పార్టీ సీనియర్ నేతల సలహాలనూ కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దళిత బెంగాలీలకు సిటిజన్షిప్ ఇవ్వడానికి మమతా బెనర్జీ అడ్డుచెబుతున్నారని విమర్శించారు.
పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ..
పౌరసత్వం రద్దు చేయడానికి సీఏఏలో ఎలాంటి ప్రొవిజనూ లేదని షా స్పష్టంచేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించేలా నిరసనలు చేస్తున్నారని, వాళ్ల నిరసనలకు భయపడి చట్టాన్ని వెనక్కి తీసుకోబోమని తేల్చిచెప్పారు. సీఏఏ విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరుతూ.. ఈ విషయంలో ఎవరితోనైనా తాను బహిరంగ చర్చకు సిద్ధమని షా వివరించారు. రాహుల్గాంధీ, అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీలలో ఎవరైనా సరే సీఏఏపై తనతో బహిరంగ చర్చకు రావాలని షా సవాల్ విసిరారు. నిరసనలు, ఆందోళనలు చేయడం సరికాదని, తనతో చర్చకు వచ్చి సీఏఏలో ఏ ఒక్క క్లాజ్ అయినా సిటిజన్షిప్ రద్దు చేయడానికి అనుకూలంగా ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు.
అక్కడి అరాచకాలు వీరికి కనబడవు
సీఏఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. 1947లో మతపరంగా దేశాన్ని రెండు ముక్కలుగా చేయడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని కోరారు. ‘దేశ విభజన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనుల జనాభా తగ్గిపోతోంది. వాళ్లంతా ఎక్కడికి పోతున్నారు? వాళ్లు హత్యకు గురికావడమో, మతం మార్చుకోవడమో లేదా మన దేశానికి శరణార్థులుగా రావడమో జరిగింది. అక్కడ వాళ్లపై జరుగుతున్న అరాచకాలు ఈ గుడ్డివాళ్లకు కనిపించట్లేదు’ అని షా మండిపడ్డారు. కేవలం మతం కారణంగా ఆ మూడు దేశాల్లో కోట్లాది మంది హత్యకు గురయ్యారని చెప్పారు. 5 లక్షల మంది పండిట్లు కాశ్మీర్నుంచి కట్టుబట్టలతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారని, అప్పుడు ఈ పార్టీలలో ఒక్క పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. ప్రధాని మోడీ వల్ల ఇంతకాలానికి వాళ్ల బతుకుల్లో మార్పు వస్తోందని చెప్పారు.
డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తున్నరు: యోగి
సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిపేందుకు ప్రతిపక్షాలు డబ్బులు వెదజల్లుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మతపరమైన అణిచివేత కారణంగా పాక్, బంగ్లా, ఆఫ్గాన్లలో బతకలేక ఎంతోమంది మైనారిటీలు కట్టుబట్టలతో మన దేశానికి వలస వస్తున్నారని చెప్పారు. ‘అధికారంలో ఉన్నపుడు ఇలాంటి వాళ్లను ఆదుకోకపోగా.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వాళ్లను ఆదుకోవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటోంది’ అంటూ కాంగ్రెస్పై యోగి మండిపడ్డారు.
3 నెలల్లో రామ మందిరం మొదలెడ్తాం
రామజన్మభూమిలో మందిరం కట్టడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందన్న అమిత్ షా.. మరో మూడు నెలల్లో అక్కడ ఆకాశాన్ని అంటేలా గుడి కట్టేందుకు పనులు మొదలెడతామని చెప్పారు. దీంతో సభకు హాజరైన జనాలు హర్షధ్వానాలు చేశారు.
RTA యాప్ : సెల్ఫీ అప్లోడ్తో బండి రిజిస్టర్