అగ్రనేతల రాక పైనే .. బీజేపీ ఆశలు

అగ్రనేతల రాక పైనే ..   బీజేపీ ఆశలు
  • రేపు నల్గొండలో అమిత్​షా విజయ సంకల్ప సభ 
  • త్వరలో మునుగోడుకు బండి సంజయ్​, పవన్​ కల్యాణ్!


నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో  బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతల రాకపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పెద్దలు వస్తేనే తమకు స్థానికంగా కాస్తయినా ఎన్నికల ప్రచారం జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్య నేతలు కాంగ్రెస్​లో చేరడంతోపాటు,   రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​ కు అనుకూలంగా ఉన్న సంకేతాలతో   ఉమ్మడి జిల్లాలో  బీజేపీ సీనియర్లు,  కార్యకర్తలు కొంత  సైలెంట్​ అయ్యారు.  దీంతో ప్రచార బాధ్యతలను ఆ పార్టీ అగ్రనేతలే భుజానికెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇందులో భాగంగానే  ప్రచారానికి హోం మంత్రి అమిత్​షా,  ఎంపీ బండి సంజయ్​,  జనసేన అధినేత  పవన్​ కల్యాణ్​​ రానున్నారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ–జనసేన పొత్తులో భాగంగా  జిల్లాలోని  కోదాడ స్థానాన్ని జనసేనకు కేటాయించింది. మిగిలిన 11 చోట్లా బీజేపీ అభ్యర్థులే పోటీచేస్తున్నారు.  

 హోంమంత్రి అమిత్​షా రాక.. 

సకల జనుల విజయ సంకల్ప సభ పేరుతో ఇటీవల సూర్యాపేట సభలో అమిత్​షా పాల్గొన్నారు. రెండో విడత శనివారం నల్గొండలో   నిర్వహించనున్నారు.   ప్రభావం చూపించే ముఖ్యమైన నియోజకవర్గాల్లో భారీ సభలు పెట్టాలని హైకమాండ్​ భావించింది. నల్గొండ, మునుగోడు, సూర్యాపేట, ఆలేరు, భువనగిరిలో సామాజిక సమీకరణాల ప్రకారం అభ్యర్థులను నిలబెట్టిన పార్టీ ఈ ఎన్నిక ల్లో  బోణీ కొట్టాలని భావిస్తోంది.   నల్గొండ అసెంబ్లీ స్థానంలో బీసీ నేత మాదగోని శ్రీనివాస్​గౌడ్​ పోటీ చేస్తుండగా,  ఆలేరులో పడాల శ్రీనివాస్, సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరావు, భువనగిరిలో గూడూరు నారాయాణరెడ్డి, మునుగోడులో చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.

ఈ ఐదు స్థానాల్లో బీజేపీకి క్యాడర్​ ఉంది.  అంతేగాక బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తరపున నిలబడిన  బలమైన అభ్యర్థులతో బీజేపీ తలపడుతోంది. గత ఎన్ని కల్లో సూర్యాపేట, నల్గొండ, మునుగోడులో బీజేపీ భారీగా ఓట్లు సాధించింది. గతేడాది జరిగిన మునుగోడు బైపోల్​లో​ ఏకంగా ఆపార్టీకి 83వేల ఓట్లు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ బీజేపీ, బీఆర్​ఎస్​ ఒకటేనని కాంగ్రెస్​ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ జిల్లా నాయకత్వం విఫ లమవుతోంది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. హైకమాండ్​ ప్లాన్​ ప్రకారం పార్టీ ప్రభావం చూపే నియోజ కవర్గాల్లో ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారం 
చేయనున్నారు.

కన్నెత్తి చూడని రాష్ట్ర నేతలు

రాష్ట్ర బీజేపీ పార్టీలో ముఖ్యనేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకోవడంతో ఆ ఎఫెక్ట్​ ఉమ్మడి జిల్లా పైన తీవ్ర ప్రభావం చూపింది.   రాష్ట్ర నాయకత్వంలో చోటుచేసుకున్న  మార్పుల వల్ల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన జిల్లాలోని ముఖ్యనేతలు సైతం సెలైంట్​ అయ్యారు. సీనియర్​ నేత గట్టు శ్రీకాంత్​ రెడ్డి సైతం బీఆర్​ఎస్​లో చేరారు. బొబ్బా భాగ్యరెడ్డి ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  ఈ పరిస్థి తులన్నింటినీ చక్కబెట్టి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో భరోసా నింపేందుకు అగ్రనేతలు  ప్రయత్నిస్తున్నారు. 

ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పైన ఆశలు...

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​ గాలి వీస్తోందని ప్రచారం జోరందుకున్న నేపథ్యం లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలే గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. బీజేపీ ఎంటర్​ కావడంతో జిల్లాలోని ఐదు స్థానాల్లో త్రిముఖ పోటీ  ఉండనుంది. బీజేపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే ఆశలు పెట్టుకుంది.     

త్వరలో మునుగోడులో భారీ సభ ప్లాన్​..

మలి విడత సభ మునుగోడులో ఉంటుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  మనోహర్​ రెడ్డి చెప్పారు. మునుగోడులో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పోటీ వల్ల  బీజేపీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికల నాటి ఊపును తీసుకొచ్చేందుకు త్వరలో జాతీయ నేతలు బండి సంజయ్​, జన సేనా అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​, జాతీయ అధ్యక్షుడు నడ్డాలను రప్పించి నియోజకవర్గంలో మూడు, నాలుగు చోట్ల రోడ్​షోలు, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మనోహర్​ రెడ్డి 'వెలుగు'కు చెప్పారు.