పెద్దపల్లిలో బీజేపీ లీడర్లు కొట్టుకున్నరు

పెద్దపల్లిలో బీజేపీ లీడర్లు కొట్టుకున్నరు
  •      బీజేపీ అభ్యర్థి ర్యాలీలో గొడవ
  •     తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక వర్గంపై మరో వర్గం ఫైర్
  •     దాడులకు దారితీసిన వాగ్వాదం

పెద్దపల్లి, వెలుగు:బీజేపీ నాయకులు కొట్టుకున్నారు. పెద్దపల్లి బీజేపీ లోక్​సభ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గురువారం పెద్దపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్​వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు తమ చేతుల్లో ఉన్న జెండాలతో కొట్టుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు ఒక వర్గంగా ఏర్పడి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ వర్గం నాయకులు చెబుతున్నారు.  

ఈ నేపథ్యంలో ప్రచార ర్యాలీలో కూడా తమను గుర్తించడం లేదనే కోపంతో గుజ్జుల వర్గానికి చెందిన పలువురు నాయకులు.. ప్రదీప్​ వర్గానికి చెందిన నాయకులను ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఆవేశంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు కలుగజేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలో రెండు వర్గాలకు చెందిన నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు  వర్గాల నాయకులు పోలీసుస్టేషన్​లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. 

ఇద్దరి పేర్లతో బీఫామ్.. అభ్యర్థిపై ఉత్కంఠ

లోక్​సభ ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ గురువారంతో పూర్తయినా పెద్దపల్లి బీజేపీలో మాత్రం టికెట్​ పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్​ను ఇది వరకే పార్టీ హైకమాండ్  ప్రకటించింది. దీంతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, కొద్ది రోజులుగా గోమాస శ్రీనివాస్​ను మారుస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీ ఫామ్​లేకుండానే పెద్దపల్లి అభ్యర్థిగా రెండు రోజుల క్రితం గోమాస శ్రీనివాస్​ నామినేషన్​ వేశారు. 

కానీ, అనూహ్యంగా బీజేపీ హైకమాండ్​ బీ ఫాంలో గోమాస శ్రీనివాస్​తో పాటు ఆల్టర్​నేట్(ఆబ్లిక్) ​గా ఎస్.కుమార్​ పేరును కూడా చేర్చి నామినేషన్ ​వేయడానికి చివరి రోజైన ఏప్రిల్​25న ఇద్దరికీ బీఫాంలు అందజేసింది. దీంతో ఎస్.కుమార్​ చివరి రోజు బీఫాంతో నామినేషన్​ వేశారు. గోమాస కూడా ఆర్ఓకు బీఫాం అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి బీజేపీలో ఎవరు ఫైనల్​ అవుతారో తేలడం లేదు. నామినేషన్ల పరిశీలన తర్వాత మాత్రమే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.