
భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్న టర్కీ, సిరియాకు భారత్ అండగా నిలిచింది. తన వంతు సాయంగా రెస్క్యూ టీమ్స్, రిలీఫ్ మెటీరియల్స్, వైద్య సిబ్బందిని ఆ దేశానికి పంపింది. ఇండియ్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు టర్కీ, సిరియాకు చేరుకున్నాయి. ఈ విమానంలో సర్జన్లు, పారామెడికల్ సిబ్బంది, రెస్క్యూ వర్కర్లు, డాగ్ స్క్వాడ్ సహా 6.5 టన్నుల మందులు పంపారు. 30 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుతో పాటు ఎక్స్రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లను భారత్ పంపింది. సహాయక సామాగ్రితో పాటు 101 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు చేరుకున్నాయి.
పాక్ వక్రబుద్ది..
భూకంపాలతో అతలాకుతలమైన టర్కీకి సాయం అందించేందుకు భారత్ నుంచి బయలుదేరిన విమానానికి ఎయిర్స్పేస్ ఇచ్చేందుకు పాక్ నిరాకరించింది. ఇండియన్ ఫ్లైట్కు పాక్ గగనతలాన్ని వాడుకోడానికి అవకాశం ఇవ్వకపోవడంతో వేరే దారిలో వెళ్ళవలసి వచ్చింది. ఉదయం 10.30 గంటలకు టర్కీలోని అదానా సకిర్పాసా విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం దిగింది.
టర్కీ ధన్యవాదాలు..
కష్ట కాలంలో అండగా నిలిచిన భారత్ కు ఇండియాలో టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ ట్వీట్లో కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు అని అన్నారు.