- ఆప్ను చిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణ
- ఢిల్లీ మంత్రి ఆరోపణలపై మండిపడ్డ బీజేపీ
- ఆధారాలు చూపకుంటే లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఛిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. నెలలోగా తనతోపాటు మరో ముగ్గురు ఆప్ నేతలు అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు. వారిలో మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, ఎంపీ రాఘవ్ చద్దా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆప్ జాతీయ కన్వీనర్, ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడైన విజయ్నాయర్తన మంత్రివర్గంలోని ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్కు రిపోర్ట్ చేసేవారని కేజ్రీవాల్ చెప్పినట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ స్కాంలో తన పేరు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆతిశీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని ఓ సన్నిహిత వ్యక్తి ద్వారా తనను కాషాయ పార్టీ సంప్రదించిందని, లేకుంటే ఈడీ ద్వారా అరెస్ట్ చేయిస్తామని ఆ వ్యక్తి ద్వారా హెచ్చరికలు జారీచేసిందని ఆతిశీ వెల్లడించారు. ‘కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్సింగ్, సత్యేంద్ర జైన్ను అరెస్ట్ చేస్తే ఆప్ అంతమవదని బీజేపీ భావించింది. అందుకే సెకండ్ లైన్ లీడర్లమైన తమను టార్గెట్ చేసింది’ అని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఇండియా కూటమి నిర్వహించిన రామ్లీలా మైదాన్ ర్యాలీ సక్సెస్ కావడంతో పాటు ఆప్ నిరసనలతో బీజేపీ ఉలిక్కిపడిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ బెదిరింపులకు భయపడం
బీజేపీ బెదిరింపులకు తాము భయపడబోమని ఆతిశీ వెల్లడించారు. తాము కేజ్రీవాల్సైనికులమని, భగత్సింగ్ శిష్యులమని పేర్కొన్నారు. దేశాన్ని రక్షించేందుకు ఆప్ చివరి వలంటీర్ వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తీహార్ జైలుకెళ్లిన నేపథ్యంలో కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు ఆతిశీ సమాధానమిస్తూ... ఆయన రాజీనామా చేసేందుకు ఎలాంటి కారణాలు లేవని తెలిపారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్పై చార్జ్షీట్ దాఖలు కాలేదని, శిక్ష పడలేదని చెప్పారు.
ఆప్ను ముక్కలు చేయలేరు: సౌరభ్ భరధ్వాజ్
ఆప్ పార్టీ అనేది సేంద్రియంగా ఎదిగిందని, దీన్ని బీజేపీ ముక్కలు చేయలేదని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. బీజేపీలో చేరాలని ఆతిశీకి బీజేపీ రాయబారం పంపడాన్ని బహిరంగ బెదిరింపుగా అభివర్ణించారు. ‘ఆప్కు చెందిన నలుగురు లీడర్లను అరెస్ట్ చేసినా పార్టీ ఇంకా మనుగడ కొనసాగిస్తున్నది. అందుకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న తమను జైలుకు పంపాలని బీజేపీ భావిస్తున్నది’ అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపి బీజేపీ 400 లోక్సభ సీట్లను గెలవాలని చూస్తున్నదని విమర్శించారు. కాగా, బీజేపీలో చేరితే తనకు రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్టు ఎమ్మెల్యే రితురాజ్ ఝా వెల్లడించారు.
మా పార్టీలో నో వేకెన్సీ: హర్ దీప్ సింగ్ పురీ
బీజేపీలో చేరాలంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురీ స్పందించారు. బీజేపీలో వేకెన్సీలు లేవని చురకలంటించారు. లిక్కర్ స్కామ్తో ఆప్ చిక్కుల్లో పడిందని, ఇప్పుడు ఆతిశీని పార్టీలో చేర్చుకుని తాము కష్టాలు కొనితెచ్చుకోబోమని మంత్రి చెప్పారు. ఆతిశీ తన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు చూపించాలని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా డిమాండ్ చేశారు. లేదంటే ఆతిశీపై లీగల్ యాక్షన్తీసుకుంటామని హెచ్చరించారు.
తొలగించాలె: బీజేపీ
లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ సీఎంగా కొనసాగేందుకు అనర్హుడని బీజేపీ వాదిస్తున్నది. కటకటాల్లో నుంచి ఆయన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నది. ఢిల్లీ నిజాయితీగా, నిష్పక్షపాతంగా పాలించే సీఎంను కోరుకుంటున్నదని తెలిపింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కాంలో జైలుకెళ్లిన డిప్యూటీ సీఎం సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ను రాజీనామా చేయాలని కేజ్రీవాల్ కోరారని, ఇప్పుడు కేజ్రీవాల్ జైలుకెళ్లినా రాజీనామా చేయడంలేదని చెప్పారు. అవినీతిని అంతం చేస్తానని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్.. అవినీతికి పర్యాయపదంగా మారారని విమర్శించారు. జైలులో నుంచి ప్రభుత్వాన్ని నడుపుతూ కేజ్రీవాల్ కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.
కొనసాగాలె: ఆప్
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్సతీమణి సునీతా కేజ్రీవాల్ను ఢిల్లీ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. మొత్తం 62 మంది ఎమ్మెల్యేలకుగానూ 55 మంది సునీతా కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. కేజ్రీవాల్ రాజీనామా చేయొద్దని, జైలునుంచే పాలన సాగించాలని వారు కోరారు. కేజ్రీవాల్కు 2 కోట్ల మంది ఢిల్లీ ప్రజల మద్దతు ఉన్నదని, ఏ పరిస్థితి ఎదురైనా ఆయన రాజీనామా చేయొద్దని సునీతా కేజ్రీవాల్తో ఎమ్మెల్యేలు అన్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. తీహార్ జైలునుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం సునీతా కేజ్రీవాల్కు మాత్రమే ఉన్నందున.. తమ నిర్ణయాన్ని కేజ్రీవాల్కు తెలియజేయాలని కోరామని సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు.