పరీక్ష ఏదైనా.. ఇవి ఫాలో అయితే.. పాలిటీలో ఈజీ స్కోర్

పరీక్ష ఏదైనా.. ఇవి ఫాలో అయితే.. పాలిటీలో ఈజీ స్కోర్

టీఎస్​పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్స్ నోటిఫికేషన్లలో ప్రధానంగా గ్రూప్ 2,3,4  పరీక్షలలో భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ సబ్జెక్టుకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ అంశం నుంచి సుమారు 50 మార్కులు వస్తాయి. పక్కా ప్లానింగ్​తో ప్రిపరేషన్​ కొనసాగిస్తూ, ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు. కరెంట్​ ఎఫైర్స్​ లింక్​ చేస్తూ సమకాలీన రాజకీయాలను పాలిటీతో అనుంసంధానం చేస్తూ ఎలా ప్రాక్టీస్​ చేయాలి, ఆర్టికల్స్​, షెడ్యూల్స్​ ఈజీగా గుర్తుంచుకునే టెక్నిక్స్​ తెలుసుకొని సిద్ధమయితే ఇందులో అత్యధిక మార్కులు సాధించవచ్చు. 

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో రాజ్య విధులు, అధికారాలలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పరిపాలన - సుపరిపాలన, ఈ - గవర్నెన్స్, హక్కుల సమస్యలు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన, అంతర్జాతీయ తీవ్రవాదం, పౌర సమాజం వంటి అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి.

ప్రశ్నల స్థాయి మారింది: ప్రస్తుత పోటీ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రశ్నల స్థాయిని బట్టి విషయాన్ని డీటెయిల్ గా చదువుతూ విశ్లేషణాత్మకంగా విచక్షణాజ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు, 2. విషయావగాహనకు సంబంధించినవి,   3. అప్లికేషన్ బేస్డ్ ప్రశ్నలు

నాలెడ్జ్ పరిశీలించే ప్రశ్నలు: ఈ తరహా క్వశ్చన్స్ ప్రధానంగా కంటెంట్‌‌‌‌కు సంబంధించి అభ్యర్థి నాలెడ్జ్ ని పరిశీలిస్తారు. వీటికి సమాధానాలు గుర్తించాలంటే విస్తృత పఠనంతోపాటు రివిజన్ ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్ష స్థాయిని బట్టి ఇటువంటి ప్రశ్నల క్లిష్టత మారుతూ ఉంటుంది.

ఉదాహరణ: ఏ రాజ్యాంగ నిపుణుడు మయన్మార్ రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు? (B)

A) బి.ఆర్. అంబేద్కర్    B) డాక్టర్ బి.ఎన్. రావు
C) కే.టి.షా    D) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

వివరణ: ఇక్కడ పేర్కొన్న వ్యక్తులు అందరికీ తెలుసు. కానీ వారి గురించి విస్తృత స్థాయిలో చదివితేనే ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలం.
విషయావగాహనకు సంబంధించినవి: కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ఒక విషయంపై అవగాహన అనేది నిరంతర సాధన ద్వారానే సాధ్యమవుతుంది.

ఉదాహరణ: కింది వారిలో ఎవరు అత్యధిక ఎన్నికలలో ఓటర్లుగా ఉంటారు?(B)

A) పార్లమెంట్ సభ్యులు    B) విధాన సభ సభ్యులు
C) విధానపరిషత్ సభ్యులు   D) సాధారణ ఓటరు

వివరణ: ఇలాంటి ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లలో వాటి మధ్య సంబంధం, విస్తృత అవగాహన ఉన్నప్పుడే సమాధానం ఇవ్వడం సాధ్యం. అంతేకాకుండా ఏ ఎన్నికలలో ఎవరు ఓటర్లుగా ఉంటారు? అనే విషయాన్ని విశ్లేషించగలగాలి. 

అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్​: ఈ  ప్రశ్నల విషయంలో కేవలం అవగాహన ఉంటే సరిపోదు. లోతుగా ఆలోచించాలి. సహజ ప్రతిభ, విచక్షణా శక్తి ఉపయోగించాలి.

ఉదాహరణ: ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు ఉన్న అధికారాలు? (D)

A) వాయిదా వేసే అధికారం B) సవరించే అధికారం
C) సిఫార్సులు చేసే అధికారం D) ఓటు వేయడం

వివరణ: ఈ ప్రశ్నకు సమాధానం ఎంపిక చేయాలంటే..రాజ్యసభకు ద్రవ్య బిల్లుపై ఎలాంటి అధికారం ఉంటుంది? అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. అంతేకాకుండా అవగాహనతోపాటు ఇచ్చిన ఆప్షన్స్ లలో సందర్భాన్ని బట్టి సరిపోయే అంశాలను గుర్తించాలి. ఇందుకు అభ్యర్థికి స్వతాహాగా విచక్షణతోపాటు నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉండాలి.

అంశాల వారీగా ప్రిపరేషన్​: విభాగాల వారీగా చదవాల్సిన అంశాలను, ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయాన్ని పరిశీలిస్తే రాజ్యాంగ రచన ముఖ్య లక్షణాల విభాగంలో వచ్చే ప్రశ్నలు ప్రధానంగా సమాచారానికి సంబంధించి ఉంటాయి. సమావేశాలు, సంబంధిత తేదీలు, చైర్మన్లు, తీర్మానాలు వంటి వాటిపై నేరుగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ప్రవేశిక, రాజ్యాంగతత్వం అనే అంశం నుంచి ప్రవేశిక లక్ష్యాలు, ఆదేశాలు, వాటి అనువర్తనకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. అదే సమయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను గుర్తుంచుకోవాలి.ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలపై వచ్చే ప్రతి ప్రశ్న ఆర్టికల్స్ కు సంబంధించినదై ఉంటుంది. కాబట్టి ఆర్టికల్స్​పై ఫోకస్​ చేయాలి. ప్రాథమిక హక్కులు, విస్తృతి, సుప్రీంకోర్టు తీర్పులు, తాజా పరిణామాలు, రాజ్యాంగ సవరణలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి విభాగంలో ఎన్నిక, ఎంపిక ప్రక్రియ, అర్హతలు, అధికార విధులు, వివిధ స్థాయిల్లో వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. 
 కేంద్ర శాసనసభ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ నిర్మాణం అనే అంశంలో ఎన్నిక, అర్హతలు, వివాదాలు, బిల్లులు - రకాలు, పార్లమెంట్ కమిటీలు, పార్లమెంట్ - శాసనసభ మధ్య పోలికలు వంటి అంశాలను సమగ్రంగా చదవాలి. భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం, నియామకం, అధికారాలు, విధులు, తాజా పరిణామాలు, తాజా తీర్పులను అధ్యయనం చేయాలి. భారత సమాఖ్య వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు అనే అంశంలో ఆర్థిక వనరుల విభజన, కేంద్ర - రాష్ట్ర సంబంధాల సమీక్ష కోసం నియమించిన కమిషన్లు డీటెయిల్ గా చదవాలి. నూతన పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన 73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రత్యేకతలు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, స్థానిక సంస్థల పనితీరు - పరిమితులను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక సమాచారం కోసం స్కూల్ లెవెల్ పుస్తకాలను అనుసరించాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర, చట్టేతర సంస్థలు అనే అంశాన్ని సమగ్రమైన రీతిలో అధ్యయనం చేసి నోట్స్ తయారుచేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

కరెంట్​ ఎఫైర్స్​తో సబ్జెక్ట్​ అనుసంధానం

రాజ్యాంగంలోని మూల సూత్రాలు, వివిధ వ్యవస్థలు సమకాలీన రాజకీయాల వల్ల ప్రభావితం అవుతుంటాయి. రాజ్యాంగ స్ఫూర్తికి, వాస్తవికతకూ గుణాత్మక తేడా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులు, వ్యాఖ్యానాలు, సవరణలు తదితర అంశాలకు సమకాలీన సమచారాన్ని జోడించి చదవాలి.
ఉదాహరణ: మత ప్రతిపాదికన రిజర్వేషన్లు, వాక్ స్వాతంత్య్రం, పార్లమెంట్ సభ్యుల అధికారాలు, - అనుచిత ప్రవర్తన నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్ర విధాన మండలి పునరుద్ధరణ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, స్థానిక సంస్థల నిర్బంధ ఓటింగ్, ప్రకరణ 370 - జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ప్రతిపాదన, గ్రీన్ ట్రిబ్యునల్స్, లోక్‌‌‌‌పాల్, లోకాయుక్త వ్యవస్థ.

గుర్తుంచుకుందాం ఇలా: 

ఇండియన్ పాలిటీలో వివిధ ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూళ్లు, కనీస - గరిష్ట వయసులు, జీతభత్యాలు, తొలగింపులు, వివిధ వ్యవస్థల అధికారాలు, విధులు, సమకాలీన సవరణలు.. ఇలా విస్తారమైన సమాచారాన్ని చదివి గుర్తుంచుకోవాలి. ఇటువంటి ప్రాథమిక సమాచారంపై కనీసం 7 నుంచి 8 ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్య సమాచారాన్ని గుర్తుంచుకోవటానికి సంబంధిత పాఠ్యాంశాలను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసుకోవాలి. ఉదాహరణకు కనిష్ట, గరిష్ట వయసులు, అర్హతకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే కనీస వయసు ఉన్న పదవులకు గరిష్ట వయో పరిమితులు ఉండవు.

ఉదాహరణ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అదేవిధంగా గరిష్ట వయో పరిమితి ఉన్న పదవులకు కనీస వయసు ఉండదు.

ఉదాహరణ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. పదవీ కాలం ఉన్న పదవీ విరమణ వయసు ఉండదు.

ఉదాహరణ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తొలగింపు ప్రక్రియ, బిల్లుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మినహా మిగతా ఎవరిని తొలగించాలన్న సదరు తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లు, రెండో రకం ఆర్థిక బిల్లు విషయంలో తప్ప మిగతా బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. రాష్ట్ర శాసనసభలో ఏ బిల్లుపై కూడా సంయుక్త సమావేశం ఉండదు. విధానసభ మాటే నెగ్గుతుంది. ఇలా పాఠ్యాంశాలను అనుసంధానం చేసుకోని చదివితే విస్తృత ప్రయోజనాలు ఉంటాయి.

- బి.ఎన్. రావు, నాలెడ్జ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, మిర్యాలగూడ