కత్తి మహేశ్ మృతిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం

కత్తి మహేశ్ మృతిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ… డ్రైవింగ్‌ చేస్తున్న సురేశ్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడని.. ఎడమ వైపు కూర్చున్న మహేశ్‌కు తీవ్ర గాయాలు కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కత్తి మహేశ్‌కు చాలా మంది శత్రువులు ఉన్నారని.. గతంలో దాడులు, కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు.

కత్తి మహేశ్ ప్రమాదంపై దర్యాప్తు జరిపించాలని ఏపీ సీఎం జగన్‌ను మందకృష్ణ కోరారు. ప్రమాదంపై స్పందించిన ఏపీ సీఎం జగన్..విచారణ చేపట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ చేసిన సురేశ్‌ను ఏపీ పోలీసులు విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసుకున్నారు. కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడితే సురేష్ కు ఎందుకు చిన్న గాయం కాలేదని అనే యాంగిల్‌లో విచారణ జరుపుతున్నారు. ప్రమాదం తర్వాత… ఏం జరిగిందనే దానిపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు.

మరోవైపు  కత్తి మహేశ్ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు చెప్పారు. మహేశ్ చనిపోయిన విషయాన్ని తమకు చెప్పకుండానే బయటకు తెలిపారన్నారు. మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరగాలని…ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదన్నారు ఓబులేషు.