- భారీగా ఇన్వెస్ట్ చేయనున్న ఆసియా పసిఫిక్ దేశాలు: ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ: జనరేటివ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాట్లు, ఇమేజ్లు వంటివి క్రియేట్ చేయడం) పై ఆసియా పసిఫిక్ దేశాలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఇన్ఫోసిస్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది ఇండియా, సింగపూర్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఏకంగా 3.4 బిలియన్ డాలర్లు (రూ.28,200 కోట్లు) ఖర్చు చేయనున్నాయి. నార్త్ అమెరికా దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ దేశాలు జనరేటివ్ ఏఐ వాడకాన్ని పెంచుతున్నాయి. నార్త్ అమెరికన్ కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఖర్చు చేస్తున్నా, వీటిపై రీసెర్చ్ మాత్రం ఆసియా పసిఫిక్ దేశాల్లోని కంపెనీలే ఎక్కువగా చేస్తున్నాయని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ (ఐకేఐ) వెల్లడించింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, ఇండియా, సింగపూర్ దేశాల్లోని వెయ్యి మందికి పైగా బిజినెస్ లీడర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే చేసింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో జనరేటివ్ ఏఐ కోసం చైనా ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఈ దేశంలోని కంపెనీలు ఈ ఏడాది 2.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తాయని అంచనా. ఇది 2023 తో పోలిస్తే 160 శాతం ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇవి 151 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తాయని అంచనా.