తెలంగాణలో మరో టీఆర్​ఎస్ పార్టీ... ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణలో మరో టీఆర్​ఎస్ పార్టీ... ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణలో మరో కొత్త పార్టీ రానుంది. అది కాస్తా అధికార బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పిని తీసుకురానుంది. అదేంటీ.. ఇప్పుడున్న పార్టీలకంటే తోపు పార్టీనా అని సందేహం రావచ్చు. అయితే.. ఆ పార్టీ నేతలతో సమస్య కాదు.. ఆ పార్టీ పేరుతోనే అసలు సమస్య. టీఆర్ఎస్ అనే అక్షరాలు వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి అనే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఓ వ్యక్తి సీఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. 

ఇన్ని రోజులు అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్  పేరుతోనే. టీఆర్ఎస్ పార్టీ కాస్తా బీఆర్ఎస్‌ గా మారటంతో.. ఇప్పుడు ఆ పేరు ఖాళీగా ఉంది. దీంతో.. కొత్త పార్టీ పెట్టాలని యోచిస్తోన్న చాలా మంది రాజకీయ నేతల దృష్టి.. టీఆర్ఎస్ పేరుపై పడింది. కాగా.. ఈ పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవటం.. అదో ఎమోషన్‌గా భావిస్తుండటం కారణంగా.. టీఆర్ఎస్ అనే అక్షరాలు వచ్చేలా నేతలు పేర్లు ఆలోచిస్తున్నారు. జనాల నోళ్లలో బాగా నానిన పేరు కావటం వల్ల అది వాళ్లకు కలిసివస్తోందని ప్లాన్ వేస్తున్నారు.

తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వెళ్ళింది. సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంగా ఓల్డ్ అల్వాల్ (ఇం. నెం. 1-4-177/148, 149/201) చిరునామాతో అప్లై చేశారు. పార్టీ ఉపాధ్యక్షులుగా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా వెల్గటూర్ గ్రామానికి చెందిన నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా పొన్నాల గ్రామానికి చెందిన సదుపల్లి రాజు వ్యవహరిస్తున్నట్లు దరఖాస్తులో అధ్యక్షుడు తుపాకుల బాలరంగం పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ అని వచ్చేలా.. "తెలంగాణ రాజ్య సమితి" అనే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం సీఈసీకి దరఖాస్తు చేసుకున్నారు.  బాలరంగం దరఖాస్తును పరిశీలించిన సీఈసీ.. కొత్త పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలంటూ 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్రకటనను తెలంగాణ రాజ్య సమితి నిర్వాహకులు ఫోర్త్ వాయిస్ అనే పత్రికలో ఆంగ్లంలో మార్చి 29న ఇచ్చినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నది. ఇదే ప్రకటనను హిందీ భాషలో సులభ్ అనే పత్రికలో మార్చి 28న ఇచ్చినట్లు పేర్కొన్నది. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం  ఈ నెల 26న విడుదల చేసిన నోటీసు ప్రకారం మే నెల 27 వరకు అవకాశం కల్పించింది. అప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు కమిషన్‌కు వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.