రివ్యూ మీటింగ్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం, వెలుగు: లే అవుట్లకు పర్మిషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇక క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలని చెప్పారు. శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే- అవుట్ ఆమోదం కోసం వచ్చిన 14 దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న 8 దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లే- అవుట్ల ఆమోదం కోసం రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల నుంచి అనుమతుల కోసం అందజేసిన దరఖాస్తులను 21 రోజుల లోగా క్లియర్ చేయాలని సూచించారు. ఆ తర్వాత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని తెలిపారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని మొక్కలు నాటాలని ఆదేశించారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల ప్రకారం ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ట్రాన్స్ కో ఎస్ఈ సురేందర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలనే వాడాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు. సింగరేణి, ఐటీసీ, నవభారత్, కేటీపీఎస్ వంటి పరిశ్రమలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసే వారు విద్యుత్ శాఖ అనుమతి తీసుకొని కరెంట్ వాడుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, విద్యుత్శాఖ అధికారులు మండపాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు.