రాంచీ: మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ ఆర్మీ జవాన్ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బుధవారం జార్ఖండ్లోని ఛత్ర జిల్లాలో జరిగింది. జిల్లాలోని కర్మ బజార్ ప్రాంతంలో పోలీసులు మాస్క్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ టైమ్లో ఆరా భూసాహి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పవన్ కుమార్ యాదవ్ తన బైక్పై వచ్చాడు. పోలీసులు అతన్ని ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తూ.. బైక్ తాళాలను గుంజుకున్రు. పోలీసుల నుంచి తన బైక్ తాళాలను పవన్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు, జవాన్ మధ్య గొడవ మొదలైంది. దీంతో పోలీసులు.. ఆ జవాన్ను కిందపడేసి కాళ్లతో తంతూ.. లాఠీలతో తీవ్రంగా కొట్టారు. జవాన్ను కొట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తర్వాత అతన్ని పోలీసు స్టేషన్ తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే జవాన్ను కొట్టిన పోలీసుల్లోనే చాలామంది మాస్క్లు పెట్టుకోకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను, ఇద్దరు ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. జవాన్ను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానిక
ఎంపీ డిమాండ్ చేశారు.