ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎనిమిదో సారి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నోటీసులపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తాను ఈడీ విచారణకు హాజరవుతాను కానీ అది మార్చి 12 తరువాతే సాధ్యమవుతుందని చెప్పారు. తాను వర్చువల్ గా మాత్రమే విచారణలో పాల్గొంటానని తెలిపారు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసులన్నీ ఇల్లీగల్ అని కేజ్రీవాల్ కొట్టిపారేశారు.
కాగా కేజ్రీవాల్ కు 2024 ఫిబ్రవరి 27న ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. అంతకుముందు ఏడు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఏ ఒక్క సమన్లకూ ఆయన స్పందించలేదు. విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. కాగా.. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.