ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. ఈ నెల ఏడో తేదీ వరకూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీకి ఇస్తూ ఆదేశాలిచ్చింది.
ముంబై సముద్ర తీరంలో క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శనివారం రైడ్ చేసింది. పార్టీలో డ్రగ్స్ వాడుతుండడంతో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రా అనే ఎనిమిది మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు అమ్మారు? ఏంటన్న విషయాలపై నిన్నటి నుంచి ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇవాళ ముంబై కోర్టులో విచారణ సందర్భంగా ఎన్సీబీ ఈ నెల 11 వరకు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.
షిప్నే కొనగలడు.. డ్రగ్స్ ఎందుకు అమ్ముతాడు?
ఈ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ తరఫున ప్రముఖ క్రిమినల్ లాయర్ సతీష్ మాన్షిండే వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ కావాలనుకుంటే ఆ క్రూయిజ్ షిప్నే కొనేయగలడని, అతడికి ఆ షిప్లో డ్రగ్స్ అమ్మాల్సిన అవసరం ఏముంటుందని వాదించారాయన. అతడిని ఎన్సీబీ అరెస్ట్ చేసినప్పుడు డ్రగ్స్ దొరకలేదని, పక్కన ఉన్నవాళ్ల దగ్గర దొరికితే ఆర్యన్ నేరం చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నేరం చేశాడనడానికి ఎలాంటి రుజువు లేనందున అతడిని విడిచి పెట్టాలని మాన్షిండే కోరారు.
ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్తో లింకులు?
ఎన్బీసీ తరఫున కోర్టులో ఏఎస్జీ అనీల్ సింగ్ వాదనలు వినిపించారు. ఆర్యన్ ఫోన్ సీజ్ చేసి పరిశీలిస్తే కోడ్ లాంగ్వేజ్లో అనేక మెసేజ్లు ఉన్నాయని, వాటి ఆధారంగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్తో లింకులు ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై మరింత లోతుగా ఎంక్వైరీ చేయాల్సి ఉందని చెప్పారు. ఆయా చాటింగ్ కాపీలను ఆయన కోర్టు ముందుంచారు. చాటింగ్లో ఉన్న విషయాలు భారీ మొత్తంలో డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించినవని అనీల్ సింగ్ చెప్పారు. దీనిపై ప్రశ్నించేందుకు నిందితులను అక్టోబర్ 11 వరకూ ఎన్సీబీ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చెంట్, మున్మున్ ధమేచా సహా ఎనిమిది మంది నిందితులను ఈ నెల 7 వరకూ ఎన్సీబీ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తు ప్రాధాన్యత దృష్ట్యా కస్టడీకి అంగీకరిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.