ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. అతడితోపాటు మరో ఏడుగుర్ని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో తన కుమారుడి కేసును డీల్ చేసే బాధ్యతలను ఓ ప్రముఖ లాయర్కు అప్పగించాడు షారూఖ్. బాలీవుడ్ బిగ్ హీరోల్లో ఒకరైన సంజయ్ దత్ కేసును వాదించిన సీనియర్ అడ్వకేట్ సతీష్ మాన్షిండేకు ఈ కేసును అప్పగించాడు. క్రిమినల్ లాయర్గా మంచి పేరు తెచ్చుకున్న మాన్షిండే ఈ కేసును టేకప్ చేయనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివాదాస్పద కేసులకు కేరాఫ్ అడ్రస్
1993లో ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయిన సంజయ్ దత్కు బెయిల్ ఇప్పించడంలో సతీష్ మాన్షిండే సక్సెస్ అయ్యాడు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్న సంజయ్ను ఈ రెండు కేసుల నుంచి బయట పడేయడంలో మాన్షిండే విజయవంతం అయ్యాడు. దీంతోపాటు 2002లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కేసును కూడా మాన్షిండేనే వాదించారు. ఈ కేసు నుంచి సల్మాన్కు బెయిల్ ఇప్పించడంతోపాటు కేసును సక్సెస్గా ముగించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
వాదించాలంటే.. భారీ మొత్తం ఇవ్వాల్సిందే
ప్రముఖుల కేసులను వాదించడంతో లా సర్కిల్స్లో మంచి పేరు తెచ్చుకున్నారు మాన్షిండే. అందుకే కేసులు ఒప్పుకోవడానికి ఆయన భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తాడని అంటుంటారు. సంజయ్, సల్మాన్ కేసులతోపాటు గతేడాది ఆత్మహత్య చేసుకున్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను వాదించేందుకు గానూ అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా మాన్షిండేను హైర్ చేసుకుంది. ఇలాంటి ప్రముఖ కేసులను డీల్ చేశారు కాబట్టే షారూఖ్ కూడా తన కొడుకు కేసును మాన్షిండేకు అప్పగించారని అర్థం చేసుకోవచ్చు.
ప్రఖ్యాత లాయర్ శిక్షణలో రాటుదేలి..
సతీష్ మాన్షిండే ఒక్కరోజులో స్టార్ అడ్వకేట్ అయిపోలేదు. జూనియర్ లాయర్గా కెరీర్ను ప్రారంభించిన మాన్షిండే.. ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ వద్ద శిక్షణ పొందారు. జెఠ్మలానీ వద్ద దాదాపు ఒక దశాబ్దం పాటు అప్రెంటీస్గా పని చేసిన మాన్షిండే.. ఆయన వాదించిన కేసుల నుంచి ఎంతో నేర్చుకున్నారు. జెఠ్మలానీ వద్ద రాటుదేలిన మాన్షిండే.. బీ టౌన్ కేసులను సమర్థంగా వాదించి ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.