వైద్య రంగంలో పరిశోధనలకు గానూ అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. స్పర్శ, శరీర ఉష్ణోగ్రతను గుర్తించే రిసెప్టార్స్పై చేసిన పరిశోధనకు గుర్తింపుగా డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్లకు 2021 సంవత్సరానికి గానూ నోబెల్ విజేతలుగా నిలిచారు. ‘‘స్పర్శ జ్ఞానం, వేడి, చల్లదనం గుర్తించగలడం వంటివి మనిషి శరీరంలో చాలా కీలకం. దీనిని మనం రోజువారీ జీవితంలో చాలా నార్మల్గా భావించినప్పటికీ.. ఈ స్పందనలను బ్రెయిన్కు నాడీ వ్యవస్థ చేరవేయడం వెనుక మూలం ఏంటన్నది పెద్ద మిస్టరీ? దీనికి సమాధానం కనిపెట్టిన ఇద్దరు సైంటిస్టులకు వైద్య రంగంలో నోబెల్ గెలిచారు” అని నోబెల్ జ్యూరీ ప్రకటించింది.
కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న డేవిడ్ జూలియస్ ఎండు మిర్చి మధ్యలో ఉండే తీగలాంటి పదార్థం (క్యాప్సైసిన్) తీసుకుని తన పరిశోధన చేశారు. క్యాప్సైసిన్ను చర్మంపై రాసినప్పుడు మంట పుట్టిడం మామాలే. అయితే ఈ ఫీలింగ్ను బ్రెయిన్కు చేరవేసేందుకు చర్మంపై ఉండే నరం చివర రిసెప్టార్ కారణమని జూలియస్ గుర్తించారు. ఇక రెండో శాస్త్రవేత్త అర్డెమ్ పటాపౌటియన్ కాలిఫోర్నియాలోని హోవర్డ్ హూగ్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన ప్రెజర్ సెన్సిటివ్ సెల్స్ సాయంతో స్పందనకు సంబంధించిన సెన్సర్స్ను గుర్తించారు. వీరి పరిశోధనల ఫలితాల ఆధారంగా నాడీ వ్యవస్థ వేడి, చల్లదనం, స్పర్శలను ఎలా గుర్తిస్తుందన్న లాజిక్ వెల్లడైందని నోబెల్ అకాడమీ పేర్కొంది.