హైదరాబాద్, వెలుగు: డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి గురువారం సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అనవసర ఆంక్షలు విధిస్తున్నదని, దీంతో 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని అందులో పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నదని ఆరోపించారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు, లెజిస్లేటివ్ ఎఫైర్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు.
ప్రధానితో పార్టీల అధ్యక్షుల సమావేశం ఉన్నరోజే..!
డిసెంబర్ 5న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని నరేంద్రమోడీ సమావేశం నిర్వహిస్తున్నారు. జీ20 దేశాల కూటమికి మన దేశం నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో జీ20 దేశాల ప్రణాళికలను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఫోన్ చేసి ఆహ్వానించారు. రెండేండ్లుగా ప్రధాని నరేంద్రమోడీకి కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని అధ్యక్షతన సమావేశం నిర్వహించే ఐదో తేదీన్నే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు వరుసగా సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్టు తెలిసింది.
ఎనిమిదో సెషన్కు కొనసాగింపుగానే..
తెలంగాణ రెండో అసెంబ్లీ ఎనిమిదో సెషన్కు కొనసాగింపుగా ఈ సెషన్ నిర్వహించనున్నారు. ఎనిమిదో సెషన్ మూడో మీటింగ్ సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి 13 వరకు నిర్వహించారు. ఇప్పుడు ఎనిమిదో సెషన్ నాలుగో మీటింగ్గా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. 2021 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 వరకు ఎనిమిదో సెషన్ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి ఏడో తేదీ నుంచి 15 వరకు ఎనిమిదో సెషన్ రెండో మీటింగ్, సెప్టెంబర్ 6 నుంచి 13 వరకు మూడో మీటింగ్ నిర్వహించారు. 2021 మార్చి 15న ప్రారంభమైన ఏడో(బడ్జెట్) సెషన్ ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఎనిమిదో సెషన్ను ప్రొరోగ్ చేయకపోవడంతో దానికి కొనసాగింపుగానే అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. కౌన్సిల్ 18వ సెషన్ 2021 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించారు. ఇప్పుడు 18వ సెషన్కు కొనసాగింపుగా నాలుగో మీటింగ్ డిసెంబర్లో ప్రారంభించనున్నారు.