
యూపీ సర్కార్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పోలీసులతోపాటు హెల్త్ వర్కర్స్ పై దాడికి తెగబడిన కరోనా అనుమానితులను తాత్కాలిక జైళ్లలో ఉంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 34 జిల్లాల్లో ఇలాంటి జైళ్లను అందుబాటులో తీసుకురానున్నట్లు స్టేట్ డైరెక్టర్ జనరల్ తెలిపింది. తబ్లిగీ జమాత్ తో సంబంధం ఉన్న వారు, ఫారెన్ నేషనల్స్ తో కాంటాక్ట్ అయిన వారినీ ఇక్కడే ఉంచనున్నారు. టెంపరరీ జెళ్లలోని వ్యక్తులు జ్యుడీషియల్ కస్టడీ లోనే ఉంటారు. ఘజియాబాద్ లో ప్రారంభం కానున్న టెంపరరీ జైలును జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే, సీనియర్ ఎస్పీ కళానిధి నైతాని తనిఖీ చేశారు. మతపర సమ్మేళనంలో పాల్గొన్న 282 మందిని ఇక్కడే ఉంచనున్నట్లు పాండే తెలిపారు. ఈ నెల మొదట్లో నేపాల్, ఇండోనేషియాకు చెందిన కొందర్ని ఘజియాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అరెస్ట్ అయిన వారిలో చాలా మందిని టెంపరరీ జైళ్లకు తరలించి అక్కడే ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. బారికేడ్లు, సీసీటీవీలు, పోలీసులతో నిత్యం పహారా మధ్య ఈ జైళ్లను యూపీ ప్రభుత్వం పర్యవేక్షించనుంది.