జైపూర్ : రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి బిల్డింగ్ టాప్ రూఫ్ పై ఎగిరిపడ్డాడు. ఈ సంఘటన రాజస్తాన్ లోని జైపూర్లో శుక్రవారం ఉదయం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆడి కారు వేగంగా ఢీకొట్టడంతో ఫ్లైఓవర్ పై నుంచి కింద ఉన్న ఒక బిల్డింగ్ టాప్ రూఫ్ పై ఎగిరిపడ్డాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారు వేగంగా నడిపి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
రాజస్తాన్లోని పాలి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మాదా రామ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం మాదా రామ్ జైపూర్ వచ్చాడు. ఉదయం 8గంటల ప్రాంతంలో మాదా రామ్ జైపూర్ లోని సోడాలా ప్రాంతంలో ఉన్న ఫ్లైఓవర్ రోడ్డును దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఫ్లైఓవర్ పై వేగంగా వస్తున్న ఆడి కారు అదుపు తప్పి మాదారామ్ను బలంగా ఢీకొట్టింది.