భారీగా పెరిగిన కార్ల అమ్మకాలు
మారుతీ 96,700 కార్లు అమ్మింది
టాటా మోటార్స్ సేల్స్ 90 శాతం పెరిగాయ్
కియా కార్లకు మస్తు డిమాండ్
న్యూఢిల్లీ: దసరా నవరాత్రుల సీజన్లో ఆటో అమ్మకాలు అదరగొట్టాయి. లీడింగ్ కారు కంపెనీలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుండాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలన్ని గతేడాది నవరాత్రితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రికి మెరుగైన రిటైల్ సేల్స్ను నమోదు చేసినట్టు వెల్లడించాయి. కియా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా కంపెనీలు కూడా ఈ పది రోజుల కాలంలో(దసరాతో కలిపి) గణనీయమైన సేల్స్ నమోదు చేసినట్టు పేర్కొన్నాయి.
కొత్త వస్తువులు, కొత్త ప్రాపర్టీలు కొనేందుకు ప్రజలు దసరా నవరాత్రులను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కరోనా దెబ్బకు అమ్మకాలు లేక విలవిలలాడుతోన్న ఆటో కంపెనీలు ఫెస్టివ్ సీజన్పై ఎంతోకాలంగా ఆశ పెట్టుకుని ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) ఈ ఏడాది నవరాత్రికి 96,700 యూనిట్ల వెహికల్స్ను అమ్మినట్టు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 27 శాతం పెరిగినట్టు ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
గతేడాది ఇదే కాలంలో మారుతీ సుజుకి 76,000 యూనిట్లనే అమ్మింది. అదేవిధంగా హ్యుండాయ్ మోటార్ ఇండియా కూడా ఈ ఏడాది నవరాత్రి సీజన్లో 26,068 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 28 శాతం ఎక్కువ. హోండా కార్స్ ఇండియా రిటైల్ సేల్స్ కూడా ఈ దసరాకి 10 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ 10,887 యూనిట్లను విక్రయించింది. గతేడాది నవరాత్రికి టాటా మోటార్స్ 5,725 యూనిట్లనే అమ్మింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రి అమ్మకాలు 90 శాతం పెరిగాయి.
కరోనా మహమ్మారితో ఎకానమీలో స్లోడౌన్ ఉన్నప్పటికీ, అమ్మకాలు పెరగడం ఆశ్చర్యకరమని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్ యూనిట్(మార్కెటింగ్ హెడ్) వివేక్ శ్రీవత్స అన్నారు. తమ కొత్త కార్లకు, యుటిలిటీ వెహికల్స్కు మంచి డిమాండ్ వచ్చినట్టు పేర్కొన్నారు. మెరుగైన డిజైన్, సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలో తమ కార్లు మెచ్చుకునే విధంగా ఉన్నాయని చెప్పారు. తమ ప్రొడక్ట్ల ప్రస్తుత వేరియంట్లను కూడా అప్డేట్ చేస్తున్నామని, పెద్ద మొత్తంలో ఆప్షన్లను కస్టమర్ల ముందు ఉంచుతున్నామని శ్రీవత్స చెప్పారు.
గ్రామాల నుంచి డిమాండ్..
కియా మోటార్స్ ఇండియా రిటైల్ సేల్స్ కూడా ఈ పది రోజుల్లో 224 శాతం పెరిగి 11,640 యూనిట్లకు చేరుకున్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా ఈ ఫెస్టివ్ సీజన్లో 5 వేల యూనిట్లను అమ్మింది. అలాగే ఎం అండ్ ఎం కూడా గతేడాది నవరాత్రితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రికి డెలివరీలను పెంచింది. గ్రామీణ ప్రాంతాల నుంచి కార్లకు డిమాండ్ కొనసాగింది. షార్ట్ టర్మ్లో ఇండస్ట్రీలో కోలుకునేందుకు ఫెస్టివ్ డిమాండ్ ఉపయోగపడుతుందని కార్ల కంపెనీలు చెబుతున్నాయి.
పనిలో తగ్గుతున్న ఏకాగ్రత.. ధ్యాసంతా ఫోన్లు, టీవీల పైనే
సీ ప్లేన్ సర్వీసులకు ఫుల్ డిమాండ్
https://www.v6velugu.com/full-demand-for-sea-plane-services-in-india/
మనీ ట్రాన్స్ ఫర్ లావాదేవీల్లో యూపీఐ రికార్డ్
https://www.v6velugu.com/upi-creates-a-new-record-in-money-transfer-transactions/