Ayush Mhatre: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ఆయుష్ మాత్రే.. సూర్య కెప్టెన్సీలో చెన్నై చిచ్చర పిడుగు

Ayush Mhatre: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ఆయుష్ మాత్రే.. సూర్య కెప్టెన్సీలో చెన్నై చిచ్చర పిడుగు

చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుష్ మాత్రే టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. అదేంటి మాత్రే చెన్నై జట్టులో ఉంటే సూర్య సారధ్యంలో ఎలా ఆడతాడనే అనుమానం రావొచ్చు. 17 ఏళ్ళ మాత్రే బుధవారం (మే 7) జరిగిన T20 ముంబై లీగ్ 2025 వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ టీనేజ్ బ్యాటింగ్ సంచలనాన్ని సూర్య కుమార్ యాదవ్ జట్టు రూ. 14.75 లక్షల భారీ ధరకు దక్కించుకుంది. మాత్రే ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ తరఫున ఆడనున్నాడు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో అతని స్థానంలో ఎంపికైన మాత్రే.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్నాడు. 17 ఏళ్ల ఈ ముంబైకర్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ ల్లో 185.22 స్ట్రైక్ రేట్‌తో 163 ​​పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్న మాత్రే.. ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఈ కుర్రాడి ఇన్నింగ్స్ లో తొమ్మిది బౌండరీలు, ఐదు సిక్సర్లు ఉండడం విశేషం. 

►ALSO READ | IPL 2025: ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు.. కారణమిదే!

ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినా మాత్రే మాత్రం ఫ్యూచర్ ఆశాకిరణంలా మారాడు. భారత అండర్ 19 జట్టు తరపున.. ముంబై సీనియర్ జట్టు తరపున తన తొలి సీజన్‌లో సంచలనాత్మక ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత.. ఐపీఎల్ లో కూడా సత్తా చాటాడు. డొమెస్టిక్ క్రికెట్ లో నాగాలాండ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో మాత్రే ముంబై మాజీ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డును బద్దలు కొట్టి లిస్ట్-ఎ క్రికెట్‌లో 150+ స్కోరు సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఈ 17 ఏళ్ళ కుర్రాడు  117 బంతుల్లో 181 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేశాడు.