బనకచర్లపై పార్లమెంట్లో ప్రశ్నిస్త : పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

బనకచర్లపై పార్లమెంట్లో ప్రశ్నిస్త : పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
  • కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన్రు: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్​ నిర్మించారని, ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేసీఆర్​లాగే కమీషన్ల కోసమే బనకచర్ల నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పార్వతీ బ్యారేజ్​ను శుక్రవారం ఎంపీ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణ సుమారు 100 నుంచి 150 టీఎంసీల నీళ్లు నష్టపోతున్నదన్నారు. 

సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే బీజేపీ అండతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ను అడ్డుకుని తీరుతామన్నారు. గత ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం అనే సినిమా చూపించిందని.. కానీ, అది అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడుకోకుండానే రాష్ట్రంలో కోటి యాభై లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. కాళేశ్వరంలో నీళ్లు లేకున్నా ఇంత పంట ఎలా పండిందో కేసీఆర్, కేటీఆర్​ సమాధానం చెప్పాలన్నారు. సింగరేణి కార్మికుల కోసం పోరాడిన దివంగత కాకా వెంకటస్వామి అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నట్టు చెప్పారు.

రామగుండంలో ఎయిర్ పోర్ట్​ ఏర్పాటుకు కృషి..

రామగుండంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీ వద్ద రూ.2 కోట్లతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్​ ఠాకూర్​ తో కలిసి ఎంపీ మాట్లాడారు. గతంలో బసంత్​ నగర్​ వద్ద ఎయిర్ పోర్టు కోసం ఫీజిబులిటీ రిపోర్టు తయారు చేయగా అది సాధ్యం కాదని ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ స్పష్టం చేసిందని, దాంతో మరో స్థలాన్ని పరిశీలించాలని తాను లేఖ రాసినట్టు తెలిపారు. 

అంతర్గాంలో ఉన్న 500 ఎకరాల పైచిలుకు స్థలాన్ని అథారిటీ అధికారులు పరిశీలించి వెళ్లారని, ఫీజిబులిటీ రిపోర్టు రావాల్సి ఉందన్నారు. పెన్షన్ ట్రస్ట్​కు ప్రతి టన్ను బొగ్గుపై రూ.20 చెల్లించేలా పార్లమెంట్​లో మాట్లాడి ఒప్పించినట్టు తెలిపారు. అనంతరం రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఓదెల మండలంలోని ఓదెల మల్లికార్జున స్వామి వార్లను ఎంపీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓలు రాజ్ కుమార్, సదయ్య, అర్చకులు పూర్ణకుంభంతో ఎంపీకి ఘన స్వాగతం పలికారు. 

గోదావరిఖనికి చెందిన కాకా అభిమాని కామ విజయ్ 108 కొబ్బరి కాయలు కొడతానని మొక్కుకోగా, ఎంపీ వంశీకృష్ణ కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చారు. ఈ కార్యక్రమాలలో లీడర్లు పి.మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, పాకాల గోవర్ధన్ రెడ్డి, కామ విజయ్, తిప్పారపు మధు, దుబాసి మల్లేశ్, రాచకొండ కోటేశ్వర్లు, గడ్డం మధు, కోరం నరేందర్ రెడ్డి, జావెద్, మండ రమేశ్, సయ్యద్​ సజ్జాద్, అల్లం సతీశ్, బండారి సునీల్, ఐలయ్య యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.