ఢాకా: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేసేవారిని వదిలిపెట్టబోమని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. మైనార్టీలపై దాడిచేసే, వేధించే వారిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. సెక్రటేరియెట్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిష్ణ కాన్సియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్తో కొత్తగా నియమితులైన ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం. సఖావత్ హుస్సేన్ సమావేశమయ్యారు. కాగా, దేశంలో మైనార్టీల భద్రతకు చర్యలు తీసుకోవాలని హుస్సేన్ను ఇస్కాన్ ప్రెసిడెంట్ సత్యరంజన్బరోయ్ కోరారు.
భద్రతా చట్టాలు రూపొందించాలని, మైనార్టీ సెల్, కమిషన్ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. మొత్తం 8 ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ఈ విషయాల్లో తన పూర్తి మద్దతు ఉంటుందని హుస్సేన్ వారికి హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ మతసామరస్య దేశమని, ఇక్కడ మొదటినుంచి అన్ని మతాల ప్రజలు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి మెలిసి పెరిగారని తెలిపారు. దేశంలో హింస, సంఘర్షణ, ద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. మైనార్టీల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మోదీకి బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ఫోన్
భారత ప్రధాని మోదీకి తాజాగా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ ఫోన్ చేశారు. దేశంలో హిందువులకు రక్షణ కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ యూనస్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. అక్కడి పరిస్థితిపై ఇద్దరం చర్చించాం. ప్రజాస్వామిక, సుస్థిర, శాంతియుత, ప్రగతశీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఉంటుందని చెప్పా. బంగ్లాదేశ్లోని హిందువులు, మైనారిటీలకు భద్రత, రక్షణ కల్పిస్తామని యూనస్
హామీ ఇచ్చారు'' అని మోదీ తెలిపారు.
