న్యూఢిల్లీ: బంగారంపై మాదిరిగానే వెండినీ తాకట్టు పెట్టుకొని లోన్లు ఇస్తామని ఆర్బీఐకి బ్యాంకులు ప్రతిపాదించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పాలసీ ఫ్రేమ్వర్క్ను తయారు చేయాలని కోరాయి. నగల ఎగుమతిదారులు వీటిని ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. గత ఏడాది వెండి నగల ఎగుమతులు 16 శాతం పెరగడంతో బ్యాంకులు ఈ ప్రపోజల్ను ముందుకు తెచ్చాయి. వెండి, వెండి వస్తువులపై లోన్లు ఇవ్వాలని చాలా కాలంగా ఎగుమతిదారులు/తయారీదారులు బ్యాంకులను అడుగుతున్నారు.
వెండిపైనా లోన్లు ఇవ్వాలని, ఈ విషయమై ఆర్బీఐ దగ్గరికి వెళ్లాలని గత నెల జరిగిన సమావేశంలో నిర్ణయించామని బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. వెండి ఎగుమతులు విలువ రూ.25 వేల కోట్లు దాటిందని, ఈ సెక్టార్ నుంచి లోన్లకు చాలా డిమాండ్ ఉందని వివరించారు. ‘‘గోల్డ్ లోన్లకు ఉన్నట్టే వెండి లోన్లపైనా రిస్కులు ఉంటాయి. ఈ సెగ్మెంట్ వార్షిక వృద్ధి 14–15 శాతం వరకు ఉంది. అందుకే గోల్డ్ లోన్ల మాదిరే వెండి లోన్లకూ రూల్స్ ఉండాలి. బంగారం మాదిరే వెండి కూడా చాలా విలువైన లోహం. ఇండస్ట్రియల్ సెక్టార్లో దీనిని విరివిగా వాడుతారు. నగల ఎగుమతిదారుల నుంచి లోన్లకు బాగా డిమాండ్ ఉంది”అని ఆయన వివరించారు.
విపరీతంగా పెరుగుతున్న డిమాండ్
సిల్వర్ ఇన్స్టిట్యూట్ లెక్కల ప్రకారం 2022లో ప్రపంచ వెండి డిమాండ్ 1.21 బిలియన్ ఔన్సుల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వెండి మార్కెట్ ఈ సంవత్సరం కూడా లోటును నమోదు చేస్తుందని అంచనా. గత 10 సంవత్సరాలుగా వెండి సరఫరా లోటు క్రమంగా పెరుగుతోంది. ఇది 2021 నుంచి 2022 వరకు 300 శాతానికి పైగా పెరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ సర్క్యూట్ల ఇంటీరియర్లలో వెండిని ఉపయోగించడం వల్ల వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం, ఫెడ్ వైఖరి వంటివి వెండి ధరలకు ఊతమిస్తాయని కోటక్ సెక్యూరిటీస్కు చెందిన రవీంద్ర రావు చెప్పారు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం నామినేటెడ్ బ్యాంకులు బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. గోల్డ్మానిటైజేషన్ స్కీములను కస్టమర్లకు అందించవచ్చు. గోల్డ్ లోన్లను రూపాయల్లోనే తిరిగి చెల్లించాలి.
బంగారం విలువకు సమానంగా అప్పు ఇస్తారు. అయితే కొన్ని షరతులకు లోబడి ఈఎంఐలను బంగారం రూపంలో చెల్లించవచ్చు. కనీసం కేజీ బంగారం అయినా ఇవ్వాలి. వెండి లోన్లకూ ఇలాంటి రూల్స్నే వర్తింపజేయవచ్చని మరో బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చెప్పారు. జెమ్ జ్యూయలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) లెక్కల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో వెండి నగల దిగుమతుల విలువ 16 శాతం పెరిగి రూ.23,492.71 కోట్లకు చేరింది. అంతకుముందు సంవత్సరంలో వీటి విలువ రూ.20,248.09 కోట్లుగా ఉంది. రూల్స్ను పాటించకుండా సరైన పర్యవేక్షణ లేకుండా బ్యాంకులు గోల్డ్ లోన్లు ఇవ్వకూడదని ఆర్బీఐ హెచ్చరించింది. కొందరు జ్యూయలర్లు గోల్డ్ లోన్ల డబ్బును వ్యాపారం కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వాడుతున్నారని పేర్కొంది. బ్యారోవర్ల ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ హిస్టరీ, మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీస్, కొల్లటేరల్ సెక్యూరిటీస్ వంటి వాటిని పరిశీలించిన తరువాతే లోన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది.