
- గ్రూప్ మొత్తం అప్పుల్లో 38 శాతమే లోకల్ బ్యాంకుల నుంచి తీసుకున్నది
- అప్పులకు సెక్యూరిటీగా ఆస్తులు, షేర్లు, క్యాస్ఫ్లోస్
బిజినెస్ డెస్క్, వెలుగు : అదానీ గ్రూప్ కంపెనీలకు అప్పులిచ్చిన బ్యాంకులు హిండెన్బర్గ్ రిపోర్ట్ చూసి పెద్దగా ఆందోళన చెందడం లేదు. కానీ, జాగ్రత్తగా ఉంటామని చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే బ్యాంకులిచ్చిన అప్పులు మొండిబాకీలుగా మారే రిస్క్ లేదని టాప్ బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. అదానీ గ్రూప్కు చెందిన 5 కంపెనీలు దేశంలోని బ్యాంకుల నుంచి సుమారు రూ. 81 వేల కోట్లు అప్పు చేశాయి. అదానీ గ్రూప్కు ఇచ్చిన అప్పులపై ప్రస్తుతానికి ఆందోళన చెందడం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఈ గ్రూప్ తాజాగా ఎటువంటి అప్పు కూడా బ్యాంక్ నుంచి తీసుకోలేదని అన్నారు. ఫ్యూచర్లో అప్పు ఇవ్వాలంటే జాగ్రత్తగా ఉంటామని పేర్కొన్నారు. హిండెన్బర్గ్ రిపోర్ట్పై క్లారిఫికేషన్ కోసం అదానీ గ్రూప్తో సంప్రదించామని, ఈ గ్రూప్కు ఇచ్చిన అప్పులపై బ్యాంక్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన అప్పులు ఆర్బీఐ పెట్టిన లిమిట్స్లోపే ఉన్నాయని ఎస్బీఐకి చెందిన మరో సీనియర్ ఉద్యోగి పేర్కొన్నారు. రెండు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన సీనియర్ ఉద్యోగులు కూడా ప్రస్తుతానికి తాము ఆందోళన చెందడం లేదని చెప్పారు. కాగా, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒకే గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు తమ దగ్గర అందుబాటులో ఉన్న క్యాపిటల్ బేస్లో 25 శాతానికి మించి అప్పు ఇవ్వకూడదు. ఆర్బీఐ రూల్స్కు లోబడే అదానీ గ్రూప్కు అప్పులిచ్చామని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ ఉద్యోగి వివరించారు. కిందటి నెల వరకు గమనిస్తే అప్పులపై వడ్డీని ఈ గ్రూప్ టైమ్కు చెల్లించిందని పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ కూడా అదానీ గ్రూప్కు ఇచ్చిన అప్పులపై ఆందోళనపడడం లేదు. కాగా, హిండెన్బర్గ్ ఎఫెక్ట్తో అదానీ గ్రూప్ కంపెనీల ఇన్వెస్టర్లకు గత రెండు సెషన్లలోనే రూ. 4.22 లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఈ గ్రూప్ కంపెనీలకు అప్పులిచ్చిన బ్యాంకుల షేర్లు భారీగా పడ్డాయి. అదానీ గ్రూప్ బాండ్లలో, స్టాక్లలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల షేర్లూ పతనమయ్యాయి.
అదానీ అప్పులు రూ.2 లక్షల కోట్ల పైనే..
అదానీ గ్రూప్ గ్రాస్ అప్పులు 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,20,584 కోట్లకు పెరిగింది. ఇందులో సుమారు రూ. 81 వేల కోట్లు దేశ బ్యాంకులు ఇచ్చాయి. బ్రోకరేజి కంపెనీ జెఫ్రీస్ రిపోర్ట్ ప్రకారం, ఈ అప్పుల్లో 70 శాతం వాటా ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఉండగా, ప్రైవేట్ బ్యాంకుల నుంచి 30 శాతం ఉంది. ఈ అప్పులకు సెక్యూరిటీగా అదానీ గ్రూప్కు చెందిన ఆస్తులు, షేర్లు, క్యాష్ ఫ్లోస్, బాండ్లు ఉన్నాయి. అందువలన అదానీ గ్రూప్ అప్పులను చెల్లించడంలో డీఫాల్ట్ అయినా, బ్యాంకులు ఈ గ్రూప్ ఆస్తులను టేకోవర్ చేయొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు అదానీ గ్రూప్ అప్పుల్లో మెజార్టీ భాగం ఫారిన్ బ్యాంకులు, బాండ్లు ద్వారా వచ్చినవే ఉన్నాయి. ఫారిన్ బ్యాంకులు అదానీ గ్రూప్కు రూ.54 వేల కోట్ల అప్పులిచ్చాయని, మరో రూ.లక్ష కోట్లకు పైగా అప్పును బాండ్ల ద్వారా సేకరించిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, అదానీ గ్రూప్ ఇష్యూ చేసిన బాండ్లలో ఎల్ఐసీ, ఎస్బీఐ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఓఎన్జీసీ, ఐఓసీ, ఎన్పీఎస్ వంటి సంస్థలే ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాయి. మరోవైపు ఎల్ఐసీ లాంటి డీఐఐలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీగా ఇన్వెస్ట్ చేశాయి.
2 రోజుల్లో ఎల్ఐసీకి రూ. 16 వేల కోట్ల లాస్..
హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ షేర్లు భారీగా క్రాష్ అవుతుండడంతో ఈ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన ఎల్ఐసీ భారీగా నష్టపోయింది. గత రెండు సెషన్లలోనే ఈ సంస్థకు రూ.16,232కోట్ల నష్టం వచ్చిందని అంచనా. ఎల్ఐసీకి అదానీ టోటల్ గ్యాస్లో 5.96% వాటా ఉంది. అదానీ ఎంటర్ప్రెజెస్లో 4.23 %, అదానీ పోర్ట్స్లో 9.14 %, అదానీ ట్రాన్స్మిషన్లో 3.65 %, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.28% వాటా ఉంది.
ఎంఎస్సీఐ ఇండెక్స్లో ఉంటాయా?
అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడడంతో మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) ఇండెక్స్లో ఈ గ్రూప్ కంపెనీలు కొనసాగుతాయో? లేదో? ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఇండెక్స్లో అదానీ గ్రూప్ కంపెనీలకు ఎక్కువ వెయిటేజ్ ఉంది. ‘పబ్లిక్గా అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలిస్తున్నాం. ఎంఎస్సీఐ ఇండెక్స్లో ఈ గ్రూప్ కంపెనీల షేర్లు కొనసాగడంపై త్వరలో క్లారిటీ వస్తుంది’ అని
ఎంఎస్సీఐ వెల్లడించింది.
నోట్: 5 కంపెనీలే దేశ బ్యాంకుల నుంచి రూ.81 వేల కోట్ల అప్పు చేశాయి.