మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. తద్వారా బీసీల రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలన్నారు.
నగరంలోని ప్రెస్క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 5,380 సర్పంచ్ స్థానాలు దక్కేవని, ఈ రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించడంతో బీసీలు రాజకీయంగా చాలా నష్టపోతున్నారన్నారు.
చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేమని, పార్టీ పరంగా ఇస్తామని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించి, ఇప్పుడు ఏం మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
