
వరల్డ్ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని బీసీసీఐ మరోసారి చాటుకుంది. కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ను, ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ను యూఏఈకి షిష్ట్ చేసిన బోర్డు.. ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ప్రతీ అడ్డంకిని దాటేస్తోంది..! రెండు మెగా టోర్నీలు ఒకే చోట జరుగుతున్నప్పటికీ.. ఐపీఎల్ ఫేజ్2కు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైన్ క్లియర్ చేసుకుంది. ఇందుకోసం తన మార్కు స్కెచ్తో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. టీ20 కప్ను అరబ్ గడ్డకు తీసుకెళ్తున్నట్టు బోర్డు బాస్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసిన తర్వాతి రోజే మెగా టోర్నీ తేదీలను ఐసీసీ ఖరారు చేసింది..! ఐపీఎల్ ఫేజ్2కు అడ్డురాకుండా వరల్డ్ కప్ ఫస్ట్ ఫేజ్ మ్యాచ్లను ఒమన్లో షెడ్యూల్ చేసేలా ఐసీసీని ఒప్పించింది..! దాంతో, ఐపీఎల్ ముగిసిన మూడు రోజులకే మెగా టోర్నీ స్టార్ట్ అవుతున్నా.. యూఏఈలోని మూడు ప్రధాన స్టేడియాల్లో వికెట్లు ఫ్రెష్గా ఉండనున్నాయి..!
దుబాయ్: కరోనా దెబ్బకు ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఒమన్కు తరలించిన మెన్స్ టీ20 వరల్డ్కప్ టోర్నమెంట్పై ఐసీసీ కూడా క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరుగుతుందని మంగళవారం ప్రకటించింది. అయితే, పూర్తి స్థాయి షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది పేర్కొనలేదు. ఐసీసీ ఈవెంట్ తరలింపుపై బీసీసీఐ నుంచి సోమవారం ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ‘ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్కు బీసీసీఐనే హోస్ట్గా వ్యవహరిస్తోంది. అయితే, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షేక్ జాయద్ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియంతోపాటు ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ వేదికలుగా వరల్డ్కప్ జరుగుతుంది’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, ‘ మెన్స్ టీ20 వరల్డ్కప్ 2021 ఎడిషన్ను సురక్షితంగా పూర్తి చేయడమే మా ప్రాధాన్యం. మ్యాచ్లు తగ్గించకుండా మాకున్న సమయంలోనే టోర్నీని పూర్తి చేయాలనేదే మా టార్గెట్. ఇందుకోసం బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, ఒమన్ క్రికెట్తో కలిసి పని చేస్తాం. ఒక అద్భుతమైన క్రికెట్ పండగను అందిస్తాం’ అని ఐసీసీ యాక్టింగ్ సీఈవో జెఫ్ అలార్డైస్ పేర్కొన్నారు. కాగా, టోర్నీ ఇండియాలోనే నిర్వహించే వీలుంటే మరింత సంతోషంగా ఉండేవాళ్లమని... బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘ వరల్డ్ కప్కు ఇండియాలో ఆతిథ్యమిచ్చే అవకాశముంటే చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ కరోనా వల్ల నెలకొన్న అనిశ్చితికి తోడు వరల్డ్ చాంపియన్షిప్కు ఉన్న స్థాయి దృష్ట్యా తరలించక తప్పలేదు. అందువల్ల యూఏఈ, ఒమన్ వేదికగా బీసీసీఐనే టోర్నీ నిర్వహిస్తుంది’ అని దాదా వెల్లడించాడు.
రెండు వారాల గ్యాప్
ఐపీఎల్ తో పాటు వరల్డ్ కప్ను యూఏఈకి షిష్ట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఐసీసీతో పాటు అందరూ పిచ్లపైనే ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు మూడు వారాల పాటు ప్రతిరోజు మ్యాచ్ జరగడం వల్ల దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లోని పిచ్లు దెబ్బతింటాయని అనుకున్నారు. అలాగే, ఐపీఎల్కు, వరల్డ్ కప్నకు గ్యాప్ తక్కువ ఉండటంపై కూడా ఇతర దేశాల బోర్డులు ఆందోళన వ్యక్తం చేశాయి. వరల్డ్ కప్నకు సెలెక్ట్ అయిన ప్లేయర్లను లీగ్కు అందుబాటులో ఉంచడం కష్టం అవుతుందని అనుకున్నాయి. కానీ, బోర్డు ఇచ్చిన మాస్టర్స్ట్రోక్తో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్టోబర్ 17 నుంచి మొదలయ్యే 12 ప్రిలిమినరీ/క్వాలిఫయర్ మ్యాచ్లను ఒమన్లో నిర్వహించేలా ఐసీసీని బోర్డు ఒప్పించింది. తద్వారా కేవలం మెగా టోర్నీలో మెయిన్ లెగ్ను మాత్రమే యూఏఈలోని మూడు వేదికల్లో జరగనున్నాయి. దీనివల్ల ఐసీసీ ప్రొటోకాల్ ప్రకారం కనీనం పది, పన్నెండు రోజుల ముందుగానే గ్రౌండ్స్, వికెట్లను ఐసీసీకి అప్పగించే అవకాశం ఉంది. ఇక, ఐపీఎల్లో మిగిలిన 31 మ్యాచ్లను అక్టోబర్ పదో తేదీ నాటికి పూర్తి చేయాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. టీ20 వరల్డ్ మెయిన్ లెగ్ అక్టోబర్ మూడో వారాంతంలో షురూ అవుతుంది. అప్పుడు టీమిండియా సహా ప్రధాన జట్ల ప్లేయర్లకు వరల్డ్ కప్ మెయిన్ లెగ్లో ఆడేందుకు రెండు వారాల బ్రేక్ లభిస్తుంది. రెండు టోర్నీల మధ్య తగినంత టైమ్ ఉంటుంది. కాబట్టి ఐపీఎల్లో ఆడేందుకు ఫారిన్ బోర్డులు తమ ప్లేయర్లకు సులభంగానే ఎన్ఓసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ‘టీ20 వరల్డ్ కప్లో 12 క్వాలిఫయర్స్ మ్యాచ్లను ఒమన్లో నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఇది ఇరువురికి లాభించే విషయం’ అని బీసీసీఐలోని కీలక వర్గాలు స్పష్టం చేశాయి.
ఫార్మాట్ ఇలా..
2016 తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ రెండు దశల్లో జరగనుంది. మొదటిది క్వాలిఫయర్స్, రెండోది మెయిన్ స్టేజ్. క్వాలిఫయిర్స్లో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా (ఎ, బి) పోటీ పడతాయి. గ్రూప్–ఎలో శ్రీలంక, పపువా న్యూ గునియా, ఐర్లాండ్, ఒమన్ ఉండగా, గ్రూప్–బిలో బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ బరిలో నిలిచాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్ తర్వాత రెండు గ్రూప్ల్లో టాప్2 టీమ్స్ నేరుగా మెయిన్ స్టేజ్ అయిన సూపర్ 12కు క్వాలిఫై అవుతాయి. గ్రూప్ ఎలో టాపర్, గ్రూప్ బిలో సెకండ్ ప్లేస్ టీమ్.. సూపర్ 12లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్తో కలిసి గ్రూప్1లో పోటీ పడతాయి. గ్రూప్–బి టాపర్, గ్రూప్ ఎలో సెకండ్ ప్లేస్ టీమ్..ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ ఉన్న గ్రూప్ 2లో బరిలో నిలుస్తాయి. నవంబర్ 14న మెగా ఫైనల్ ఉంటుంది. ఐసీసీ, బీసీసీఐ తొందర్లోనే పూర్తిస్థాయి షెడ్యూల్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.