హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఆదేశాల ప్రకారం తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 బీఈడీ అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అబిడ్స్లోని మంత్రి ఆఫీసు ఎదుట రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
13 ఏండ్ల నుంచి తమను గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన డీఎడ్ వారికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. తమ బతుకులు రోడ్డు మీద పడ్డాయని, ప్రభుత్వం ఇకనైనా ఆదుకోవాలని కోరారు. సుమారు 800 మంది బీఎడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవలే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని వారు కోరుతున్నారు.