తొలి ప్రయత్నంలోనే .. జాబ్స్ కొట్టిన సీఓఈ విద్యార్థులు

తొలి ప్రయత్నంలోనే ..  జాబ్స్ కొట్టిన సీఓఈ విద్యార్థులు
  • ఎసెస్సీ జీడీ కానిస్టేబుల్ ఫలితాల్లో  ముగ్గురు విద్యార్థుల ప్రతిభ

బెల్లంపల్లి, వెలుగు: ఎస్ఎస్ సీ జీడీ కానిస్టేబుల్ ఫలితాల్లో బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ)కి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. ఆదివారం సీఓఈలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ చుంచు రమేశ్ కుమారుడు చుంచు కార్తీకేయ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా జాబ్ సాధించినట్లు తెలిపారు. 

అంతేకాకుండా లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన రైతు గొడిసెల లచ్చయ్య కుమారుడు గొడిసెల అనిల్ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గా, దహెగాం మండలంలోని అమరగొండ గ్రామంలో పేదకుటుంబానికి చెందిన బుజాడి -శంకర్ కుమారుడు బుజాడి నరేందర్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. వీరంతా ఈ మధ్యే ఇంటర్​పూర్తిచేశారని, తొలి ప్రయత్నంలోనే జాబ్స్ సాధించారని తెలిపారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శి డా.నవీన్ నికోలస్, జాయింట్ సెక్రెటరీ కంభంపాటి శారద, ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి, డీసీఓ బాలభాస్కర్ ప్రత్యేకంగా ఫోన్ చేసి వారిని అభినందించారు.