
కరోనా వైరస్ను నిర్మూలించేందుకు అందరూ సులభంగా వేసుకునేలా ముక్కులో వేసుకునే చుక్కుల మందును తయారు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఎండి కృష్ణా ఎల్లా తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ISB నిర్వహించిన వెబినార్లో కృష్ణా ఎల్లా పాల్గన్నారు. ఇప్పటికే కరోనా నివారణకు తాము తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో విడత మానవ పరీక్షలకు వెళ్లిందన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ను రెండు దఫాలుగా వేయాలని, భారత దేశ ప్రజలందరికీ వేయాలంటే 260 కోట్ల సిరంజీలు, సూదులు అవసరమౌతాయని చెప్పారు. ఇది కొంత ఇబ్బందిగా ఉండటంతో … దీనికి పరిష్కారం కోసమే ముక్కులో వేసుకునే చుక్కల వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ చుక్కల మందు వచ్చే ఏడాదికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా వైరస్ ప్రమాదకరంగా మారుతుందని తాము ముందే ఊహించి తమ కంపెనీలో BSL 3 ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇటువంటి ఉత్పత్తి కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు.