
- స్పృహ తప్పిన హోంగార్డు మహిళా అభ్యర్థిని ఆస్పత్రికి తరలిస్తూ దారుణం.. బిహార్లో ఘటన
- అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్ అరెస్టు
గయా: బిహార్లో దారుణం చోటు చేసుకున్నది. అంబులెన్స్లో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత గురువారం బోధ్గయాలోని మిలటరీ పోలీస్ గ్రౌండ్స్లో హోంగార్డు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. దీనికి హాజరైన ఓ యువతి (26).. ఫిజికల్ టెస్టులు చేస్తున్న క్రమంలో స్పృహ తప్పిపడిపోయింది. దీంతో సిబ్బంది వెంటనే ఆమెను అంబులెన్స్లో సిటీలోని అనుగ్రహ నారాయణ్ ఆస్పత్రికి పంపించారు.
అయితే బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత.. అంబులెన్స్లో తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. ‘‘నేను ఫిజికల్ టెస్టుల సందర్భంగా స్పృహ తప్పి పడిపోయాను. నన్ను అంబులెన్స్లో తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం మెలకువ ఉన్నది. అంబులెన్స్లో నాపై ముగ్గురి నుంచి నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు” అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత యువత పేర్కొంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేశారు.
అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్ను అరెస్టు చేసినట్టు సిట్ అధికారులు శనివారం ప్రకటించారు. వాళ్లిద్దరినీ బాధితురాలు గుర్తుపట్టిందని తెలిపారు. ‘‘నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు పెట్టాం. బాధితురాలికి మెడికల్ పరీక్షలు చేయించాం. ఆ రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం” అని ఎస్పీ రామానంద్ కుమార్ చెప్పారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్..
గ్యాంగ్రేప్ ఘటనతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. లా అండ్ ఆర్డర్ను కాపాడడంలో నితీశ్ సర్కార్ విఫలమైందని ఫైర్ అయ్యాయి. ‘‘బిహార్లో రాక్షస రాజ్యం నడుస్తున్నది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నితీశ్ కుమార్ సర్కార్ మౌనంగా ఉంటున్నది. నితీశ్ సర్కార్ హటావో.. బేటీ బచావో” అని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది. గయాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ మా పార్టీ పోరాడుతుంది” అని కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ రాజేశ్ కుమార్ తెలిపారు.