ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలంలో పవర్ గ్రిడ్ హై టెన్షన్ లైన్ నిర్మాణంలో రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదివారం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీజీఎం బిపిన్ బిహారి రత్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్, డీజీఎం సతీశ్కు బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో వారిని కలిసి సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీదర్–మహేశ్వరం హై టెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణంతో కడ్తాల్ మండలంలో రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ విషయంపై నవంబర్ 3న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిసి సమస్యను వివరించగా, మంత్రి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని గుర్తు చేశారు.
తమకు నష్టం చేస్తున్న లైన్ అలైన్మెంట్ మార్చాలని రైతులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీజీఎం రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహా రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేశ్, బాధిత రైతులు పాల్గొన్నారు.
