వైవిధ్యంతోనే మనుగడ

వైవిధ్యంతోనే  మనుగడ

భూమిపై విభిన్న జీవుల మనుగడకు జీవ వైవిధ్యం అత్యంత అవసరం. జీవాల మధ్య భేదాన్నే 'జీవ వైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వేర్వేరు జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌‌ సంవ త్సరాల పరిణామం. మన ఆధునిక జీవనశైలి, పర్యావరణం కాలుష్యంతో భూగోళం వేడెక్కిపోతున్నది. దీంతో జీవవైవిధ్యం గణనీయంగా దెబ్బ తింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది.

కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం.  గొలుసుకట్టులోని  ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగిలిన అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం పడుతుంది. సృష్టిలోని జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, అలాగే ఏదీ తక్కువ కాదు. ఒకదాని మీద ఒకటి  ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. 

ప్రకృతిపై ఆధారపడ్డ మనిషి

మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్ధతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి.

కానీ, ఇదంతా గత వైభవం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.  గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు కనుమరుగైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను మన జీవన శైలితో రూపుమాపేశాం. సముద్ర తీరాలను అతలాకుతలం చేసేశాం.  ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. 

కీటక నాశనులకు ప్రాధాన్యం

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యం పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు, అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోతున్నాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి. మన దేశంలో ఆదివాసులు (గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగా, పదిలంగానూ ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారు. వారిలో దాదాపు 53 తెగలున్నాయి.

మేఘాలయ, నాగాలాండ్‌‌, మిజోరాం, అరుణాచల్‌‌ ప్రదేశ్‌‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు.

తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. 

- ఎం. రాం ప్రదీప్​