జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్.. స్పాన్సర్ ​చేసిన కేరళ సీఎం అల్లుడు!

జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్.. స్పాన్సర్ ​చేసిన కేరళ సీఎం అల్లుడు!
  • ఆ రాష్ట్ర బీజేపీ నేతసురేంద్రన్ ఆరోపణలు
  • ఆమె టూర్ వెనక ఉద్దేశంఏంటని ప్రశ్నలు
  • ఆరోపణలపై స్పందించని కేరళ ప్రభుత్వం, సీఎం

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టైన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కేరళ టూరిజం డిపార్ట్‌‌మెంట్‌‌తో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. కేరళ సీఎం పినరాయి విజయన్ అల్లుడు రాష్ట్ర మంత్రి పీ.ఏ. మహ్మద్ రియాస్ ఆమె కేరళ పర్యటనకు స్పాన్సర్ చేశారని ఆ రాష్ట్ర బీజేపీ నేత సురేంద్రన్ ఆరోపించారు. జ్యోతి మల్హోత్రా గతంలో కేరళలోని కన్నూర్‌‌ను విజిట్ చేశారు. ఈ ట్రిప్‌‌ను కేరళ టూరిజం డిపార్ట్‌‌మెంట్ స్పాన్సర్ చేసిందని, దీని వెనుక మహ్మద్ రియాస్ ఉన్నారని సురేంద్రన్ చెప్తున్నారు. 

“కన్నూర్ ట్రిప్‌‌లో ఆమె ఎవరెవరిని కలిసింది? ఎక్కడెక్కడికి వెళ్లింది? దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటి?” అని ఆదివారం సురేంద్రన్ ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై కేరళ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్‌‌కు చెందిన సున్నితమైన సమాచారం పాకిస్థాన్‌‌కు చేరవేశారని ఆరోపిస్తూ జ్యోతి మల్హోత్రాను మే 16న హరియాణా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌ల నుంచి సుమారు 13 టెరాబైట్ల డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఆమె బ్యాంక్ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఆమె పాకిస్థాన్‌‌కు రెండుసార్లు వెళ్లినట్లు సమాచారం. పాకిస్థాన్ హైకమిషన్‌‌లో జరిగిన ఇఫ్తార్ డిన్నర్‌‌కు కూడా ఆమె హాజరైనట్లు వీడియోలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెతో పాటు మరికొందరు యూట్యూబర్లు కూడా పరిశీలనలో ఉన్నారు.