- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వెల్లడి
- 698 కోట్లతో రెండో స్థానంలో బీఎస్పీ
- ప్రాంతీయ పార్టీల్లో తొలి రెండు స్థానాల్లో ఎస్పీ, టీఆర్ఎస్
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశంలోనే అత్యధిక ఆస్తులున్న పార్టీగా నిలిచింది. ఈ పార్టీకి రూ.4,847.78 కోట్ల ఆస్తులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఇక రెండో స్థానంలో బీఎస్పీ నిలిచింది. యూపీకి చెందిన ఈ పార్టీకి 698.33 కోట్లు ఉన్నాయట. కాంగ్రెస్కు 588.16 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ చెప్పింది. 2019–20 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తుల లెక్కలను ఏడీఆర్ రిలీజ్ చేసింది. ఏడు నేషనల్ పార్టీల మొత్తం ఆస్తులు రూ.6,988.57 కోట్లు కాగా, 44 రీజనల్ పార్టీల ఆస్తులు రూ.2,129.38 కోట్లని చెప్పింది.
ప్రాంతీయ పార్టీల్లో రెండో స్థానంలో టీఆర్ఎస్
ప్రాంతీయ పార్టీల్లో సమాజ్వాదీ పార్టీకి 563.47 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ ఉంది. గులాబీ పార్టీకి 301.47 కోట్ల ఆస్తులు ఉండగా, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకి 267.61 కోట్ల అస్సెట్స్ ఉన్నాయి. రీజనల్ పార్టీలు ప్రకటించిన ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు రూ.1,639.51 కోట్ల ఎఫ్డీలు ఉన్నాయి. ఎస్పీకి రూ.434 కోట్లు, టీఆర్ఎస్కు రూ.256 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఏడు జాతీయ, 44 ప్రాంతీయ పార్టీలకు 134.93 కోట్ల అప్పులు కూడా ఉన్నాయట. నేషనల్ పార్టీలకు 74.27 కోట్లు, ప్రాంతీయ పార్టీలకు 60.66 కోట్లు బాకీలు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది.